1962లో ఏం జరిగిందో తెలుసుగా?: చైనా, ఏం.. మీకు1967 గుర్తులేదా?: భారత్
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా మీడియా యుద్ధం ప్రారంభించింది. చైనా మేధావులు కొందరు 1962లో చైనా విజయాలను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చ
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సిలిగురి కారిడార్కు చేరువగా డొక్లామ్లో రహదారిని నిర్మించేందుకు యత్నించిన చైనీయులను భారత సైనికులు అడ్డుకోవడమే ఇందుకు కారణం.
ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా మీడియా యుద్ధం ప్రారంభించింది. చైనా మేధావులు కొందరు 1962లో చైనా విజయాలను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు 1962లో ఏం జరిగింది?
చైనాపై భారత్ వెనుకంజ?
1962లో మనం చైనా చేతిలో వెనుకంజ వేసిన విషయం వాస్తవమే. కానీ 1967లో సిక్కింలోని నాథు లా సెక్టార్లో చైనా సైన్యాన్ని భారత సైన్యం చావుదెబ్బ తీసింది. ఈ విషయాన్ని కూడా చైనా మీడియా గుర్తుంచుకోవాలని భారత మాజీ సైనికాధికారులు హెచ్చరిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో చైనా దారుణంగా దెబ్బతింది.
1967లో అసలేం జరిగింది?
1967 ఆగస్టులో సిక్కిం సెక్టార్లోని నాథు లా మార్గం సమీపంలో చైనా సైన్యం రహస్యంగా చొచ్చుకువచ్చింది. భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా కందకాలను కూడా తవ్వింది. దీన్ని గమనించిన భారత సైనికులు వాటిని నిలిపివేయమని విజ్ఞప్తి చేశారు.
చైనా దుర్మార్గపు ఆలోచన...
అయితే భారత సైన్యం చేసిన విన్నపాలను చైనా ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పైగా భారత దళాలపైకే కాల్పులు ప్రారంభించింది. కీలకమైన నాథు లా మార్గం వ్యూహాత్మకమైనది. దీనిని స్వాధీనం చేసుకుంటే సిక్కింని తమ ఆధీనంలోకి తీసుకువచ్చనేది చైనా దుర్మార్గపు ఆలోచన.
తిప్పికొట్టిన భారత సైన్యం...
అయితే చైనా ఆలోచన పసిగట్టిన భారత సైనిక నాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది. చైనా కాల్పులను తిప్పికొట్టాలని నిర్ణయించింది. తక్షణమే మన వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. నాథు లాతో పాటు చో లా మార్గాలపై కూడా చైనా దాడులు ప్రారంభించింది. భారత సైనికులు వీరోచిత పోరాటానికి ఈ యుద్ధం తార్కాణంగా నిలిచింది.
తోకముడిచిన చైనా సైన్యం ...
వరుసగా నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత దళాల ధాటికి చైనీయులు తట్టుకోలేక తమ సరిహద్దులకు పారిపోయారు. ఈ ఘర్షణల్లో భారత సైనికులు 88 మంది వీరమరణం పొందగా.. చైనా సైనికులు 450 మంది హతమయ్యారు. చోలా లా మార్గంలోనూ కూడా భారత సైన్యం.. చైనీయులకు బుద్ధిచెప్పడంతో చివరికి ఎర్రసైన్యం తోకముడిచింది. అయితే అప్పటి ఈ యుద్ధం విషయాలు ఎక్కువగా వ్యాప్తిలోకి రాకపోవడంతో భారత సైన్యం వీరోచిత పోరాటం సైతం మరుగున పడిపోయింది.