మా వ్యవహారాల్లో జోక్యం వద్దు: చైనా వార్నింగ్కు ధీటుగా భారత్
చైనాకు మరోసారి భారత్ ధీటైన జవాబిచ్చింది. బౌద్ధ గురువు దలైలామాను, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అనుమతించరాదని చైనా హెచ్చరించిన నేపథ్యంలో భారత్ సరైన రీతిలో ఘాటుగా స్పందించింది.
న్యూఢిల్లీ: చైనాకు మరోసారి భారత్ ధీటైన జవాబిచ్చింది. బౌద్ధ గురువు దలైలామాను, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అనుమతించరాదని చైనా హెచ్చరించిన నేపథ్యంలో భారత్ సరైన రీతిలో ఘాటుగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేసింది. అంతేగాక, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాకు హితవు పలికింది. దలైలామా పర్యటనపై చైనా అభ్యంతరాలు సరికాదని, ఇది మతపరమైన పర్యటన తప్ప, రాజకీయాలు లేవని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
కాగా, మంగళవారం నుంచి దలైలామా వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. చైనా సరిహద్దుల్లో అత్యంత సున్నితమైన తవాంగ్లో సైతం పర్యటిస్తారు.
కాగా, దలైలామాను అడ్డుకోకుంటే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దౌత్యపరమైన ఇబ్బందులు తప్పవని చైనా ఇప్పటికేహెచ్చరించింది. గతంలో కూడా చైనా ఇలాంటి హెచ్చరికలు చేసింది. కానీ, భారత్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు.