'అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు?': భారత్పై ఆగ్రహం, చైనా అడ్డగోలు వాదన
భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన డ్రాగన్.. చైనా సరిహద్దులకు సమీపంలో.. లడఖ్ సెక్టార్లో భారత్ రోడ్డు నిర్మించడాన్ని మాత్రం తట్టుకోలేకపోతోంది.
న్యూఢిల్లీ: డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడం పట్ల గుర్రుగా ఉన్న డ్రాగన్.. భారత్పై కన్నెర్ర జేసింది. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన డ్రాగన్.. చైనా సరిహద్దులకు సమీపంలో భారత్ రోడ్డు నిర్మించడాన్ని మాత్రం తట్టుకోలేకపోతోంది.
లడఖ్ సెక్టార్లో ఇండియా రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భారత తన చేత్తో తన ముఖం మీద కొట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ విమర్శించారు.
లడఖ్ సరిహద్దులోకి అసలు చైనా సైన్యం వచ్చిన విషయమే తమకు తెలియదని చెప్పిన హు ఇప్పుడు తమ సైన్యం పహారా కాసేందుకు మాత్రమే వచ్చిందని వెనకేసుకొచ్చారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం ఆగస్టు 15న మా సైన్యం ప్యాంగ్యాంగ్ సరిహద్దులో గస్తీ కాసేందుకు వచ్చింది. అప్పుడు భారత్ సైన్యం హింసాత్మక చర్యలకు దిగింది. ఈ ఘర్షణలో మా సైన్యంలో కొందరు గాయపడ్డారు' అని ఆమె తెలిపారు.
లడఖ్లోని ప్యాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని మర్సిమిక్ లా నుంచి హాట్ స్ప్రింగ్ వరకూ భారత్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ప్యాంగ్యాంగ్ వద్దే భారత్, చైనా సైనికులు ఆగస్టు నెల ప్రారంభంలో ఘర్షణకు దిగారు.
రోడ్డు నిర్మించాలనే భారత్ నిర్ణయం పెద్ద తప్పిదమని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భారత్ చర్య కారణంగా ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు దెబ్బతింటాయని ఘాటుగా విమర్శించింది. సరిహద్దుల విషయంలో భారత్ పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ.. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ పోరాటం నిజంగా అద్భుతమంటూ ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తింది. ఓవైపు పాకిస్తాన్ను ఆకాశానికి ఎత్తుతూ.. మరోవైపు భారత్ను విమర్శించడంతో చైనా వైఖరేంటో మరోసారి తేటతెల్లమైంది.
సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్-చైనా మధ్య రెండున్నర నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు నుంచి ఎలాగైనా భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకునేలా చేయాలని చైనా యత్నిస్తోంది. కానీ చైనా ఆటలు భారత్ ముందు సాగడం లేదు. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ అందుకు చైనా ససేమిరా అనడం తెలిసిందే.