అమెరికాతో చైనా దోస్తీ: వాణిజ్య యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకోగలదా..?
ఓ వైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో చైనా ఉపాధ్యక్షుడు లీహీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గుడ్డికంటే మెల్లమేలు అన్నట్లుగా వాణిజ్యం పరంగా చైనాకు కొంతలో కొంత ఊరట లభించింది. నవంబర్లో జరిగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు వేదికగా చైనాతో పాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దీంతో చైనాకు కాస్త ఊరట లభించినట్లయ్యింది.
ట్రంప్తో చైనా ఉపాధ్యక్షుడు భేటీ
ఇప్పటి వరకు వాణిజ్యపరంగా రెండుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కాస్త చల్లబడ్డాయనుకోవచ్చు. ఇద్దరి మధ్య వాణిజ్య యుద్ధాన్ని అవకాశంగా మలుచుకోవాలని భావిస్తున్న భారత్తో సహా పలుదేశాలు చాలా దగ్గరగా పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. 2017 నుంచి చైనా అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంను ఇతర దేశాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. పెట్టుబడులను తమ దేశంలో పెట్టాల్సిందిగా రెండు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడప్పుడే ముగియదని నిపుణులు చెబుతున్నారు.
చైనాతో పాక్షిక వాణిజ్య ఒప్పందంకు ట్రంప్ ఓకే
చైనాకు తాత్కాలికంగా ఊరటనిచ్చేందుకే ఈ పాక్షిక ఒప్పందంను అమెరికా తెరపైకి తీసుకొచ్చిందని చెబుతున్నారు నిపుణులు. అమెరికా గురించి ట్రంప్ గురించి చైనాకు బాగా తెలుసని ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు ఇతర దేశాల్లో తన మార్కెట్లకు అవకాశాలు ఏమేరా ఉన్నాయనేదానిపై చైనా దృష్టిసారించిందని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశాలపై కూడా డ్రాగన్ కంట్రీ కన్నేసినట్లు సమాచారం. అమెరికాకు చైనా టెక్నాలజీని పంపుతుంటే చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను పంపుతోందని ఇది వాణిజ్య సంబంధాల్లో భాగమే అని నిపుణులు వెల్లడించారు.
ట్రంప్ వ్యవహారం తాత్కాలికమే.
ప్రస్తుతం చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధంతో దాదాపు 400 బిలియన్ డాలర్లు లోటు ఏర్పడిందని, ఇక వచ్చే ఏడాది ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు వెళుతున్న క్రమంలో చైనాపై చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయని జియో పొలిటికల్ అనలిస్టు పతిక్రిత్ పేన్ చెప్పారు. ఈ క్రమంలోనే చైనాకు అతిపెద్ద మార్కెట్ అవసరం అని ఇందుకోసం భారత్ వైపు చూసే అవకాశం ఉన్నట్లు పతిక్రిత్ చెప్పారు. ఇక వాణిజ్య యుద్ధంతో భారత్ అవకాశాలను మలచుకోవడంలో విఫలమవగా చిన్న దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థికవ్యవస్థ గాడితప్పడంతో ఈ మంచి అవకాశం కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధిరేటు పరంగా పుంజుకున్న బంగ్లాదేశ్
ఓ వైపు ఆర్థిక స్థిరత్వం నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా బంగ్లాదేశ్ మాత్రం మంచి వృద్ధి రేటుతో దక్షిణఆసియాలో తొలిస్థానంలో నిలిచింది. 2018లో బంగ్లాదేశ్ వృద్ధి రేటు 7.9 శాతం ఉండగా 2019కి ఇది 8.1శాతంకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్లో ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు చాలామటుకు అధికారాలు కట్టబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. చైనా ఏకీకృత దేశం అయినప్పటికీ అన్ని ప్రావిన్స్లకు ఒక్కో విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు. భారత్కు మొత్తానికి ఒక విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఉంటే ఆయా రాష్ట్రాల్లో కనీసం ఒక్క విదేశీ కార్యాలయం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు.
చైనా మార్కెట్లను భారత్ శాసిస్తుందా..?
చాలావరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా జిల్లా కలెక్టర్లు సమీక్షిస్తున్నారు. వాణిజ్యపరమైన అంశాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే డీల్ చేసేలా అనుమతించాలని నిపుణులు చెబుతున్నారు. చైనా మార్కెట్లను భారత్ శాసించగలిగితే, ఇతర అంశాలపై కూడా భారత్ పట్టుబిగించగలిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే భారత్ వెనకడుగు వేస్తోందని చెబుతున్నారు. మార్కెట్లను శాసించగలిగే స్థాయికి భారత్ వస్తే కశ్మీర్, పాకిస్తాన్ల అంశంలో చైనా వైఖరిని నేరుగా ప్రశ్నించగలదని లేదా పాక్కు అండగా నిలుస్తున్న చైనాపై ఆధిపత్యం కొనసాగించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.