కశ్మీర్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్న చైనా... పావుగా పాకిస్తాన్ను వాడుకుంటోందా..?
చైనా పాకిస్తాన్లకు మధ్య డ్రాగన్ కంట్రీ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ దేశ భద్రతకు ముప్పు అని భారత్ భావిస్తోంది. అదేసమయంలో చైనా సైన్యం ఆ దేశ సరిహద్దుల్లో తిష్ట వేసి ఉంది. మరోవైపు ఇరాన్తో పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్కు ఆయిల్ సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఇరాన్ను కోరే అవకాశం ఉంది. అరేబియా సముద్రం, మధ్యాసియా దేశాలు పలు దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తున్నాయి. అది కూడా చైనా కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇక భారత్కు ఆయిల్ సరఫరా నిలిపివేయాల్సిందిగా పాకిస్తాన్ ఇరాన్కు ఎలాగూ చెబుతుంది. అయితే భారత్ మాత్రం వీటిని పట్టించుకోకుండా పాక్పై తను వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉంది.
పాక్తో సంబంధం లేకుండా భారత్ వాణిజ్యం
ఇదిలా ఉంటే మే 2016లో భారత ప్రధానమంత్రి మోడీ ఇరాన్లో పర్యటించారు. ఆ సమయంలో ఇరాన్లో చాబహార్ పోర్టు నిర్మాణం కోసం భారత్ 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఆమేరుకు ఒప్పందం చేసుకుంది. ఇరాన్కు ఆగ్నేయ దిశగా ఉన్న సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో చాబహార్ పోర్టు నిర్మాణం చేపడుతోంది. తాను చేపడుతున్న గ్వదార్ ప్రాజెక్టుకు భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టును పోటీగా చూస్తోంది చైనా. ఒకవేళ చాబహార్ పోర్టు నిర్మాణం జరిగితే పాకిస్తాన్తో సంబంధం లేకుండా అఫ్ఘానిస్తాన్, మధ్యాసియా దేశాలతో నేరుగా భారత్ వాణిజ్యం నడిపే అవకాశం ఉంది. అంటే భారత ఉత్పత్తులను ఈ పోర్టు నుంచి నేరుగా ఆయాదేశాలకు రవాణా చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరాన్, అఫ్ఘానిస్తాన్ దేశాలు భారత్కు అన్ని విధాలుగా సహకరించేలా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక చాబహార్ పోర్టు నిర్మాణం పూర్తయ్యాక భారత్ నుంచి ఆఫ్ఘానిస్తాన్కు అక్టోబర్ 2017లో తొలిసారిగా గోదుమలను రవాణా చేసింది.
డొక్లాం అంశంలో కఠినంగా వ్యవహరించిన భారత్
2017లో చైనా భూటాన్ దేశాల మధ్య ఉన్న రహదారి వివాదంలో... చైనా జోక్యం చేసుకుంది. చైనా సైన్యం అక్కడ తిష్ట వేసి రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది గమనించిన భారత్ వెంటనే ఆ రహదారి నిర్మాణపనులు నిలిపివేయాల్సిందిగా అడ్డు తగిలింది. ఇదే డొక్లాం వివాదంగా పేరుగాంచింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత ప్రధాన భూభాగాన్ని సిలిగురి కారిడార్ వేరుచేస్తోంది. ఒక వేళ చైనా ఈ రహదారిని తన చేతిలోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలను భారత్నుంచి వేరు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే తప్పని సరి పరిస్థితుల్లో చైనాతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక రహదారి నిర్మాణ పనులు ఆపివేస్తున్నామని డ్రాగన్ కంట్రీ ప్రకటించడంతో ఆ వివాదం సమిసిపోయింది. ఇప్పటికైతే ఆపివేస్తున్నట్లు ప్రకటించిన చైనా భవిష్యత్తులో మాత్రం దీనికి ఓ పరిష్కార మార్గం కనుగొని తమ హక్కులను వినియోగించుకుంటామని పేర్కొంది. ఇప్పటికీ భారత్, చైనాలకు సంబంధించిన సైన్యం ఒకరికొకరి మధ్య వంద మీటర్ల దూరంలో పహారా కాస్తున్నాయి.
డొక్లాం వివాదం తలెత్తక నెలరోజుల ముందు చైనా పలు అగ్రదేశాలతో సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణం కోసం సహకరించాల్సిందిగా ఆ దేశాలను కోరింది. అయితే ఈ సమావేశంలో భారత్ పాల్గొనడం లేదని ఒక్కరోజు ముందు తేల్చిచెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు నిర్మాణం జరిగితే చైనా భారత్లకు మంచిది కాదని భారత్ వెల్లడించింది. అంతేకాదు ఈ రోడ్డు నిర్మాణం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్, బలితిస్తాన్గుండా వెళ్లాల్సి ఉంది కనుక పాక్ భారత్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని భారత్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే కశ్మీర్కు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ఎలాంటి సంబంధం ఉండదని చైనా పదే పదే చెప్పినప్పటికీ భారత్ మాత్రం లేనిపోని అనుమానాలు రేకెత్తించి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చైనా మీడియా కథనం రాసుకొచ్చింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఇక ఎప్పటికీ పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వస్తుందని భారత్ చెబుతోంది. అంతేకాదు ఈ సమస్యకు పరిష్కారం చూపలేమని కూడా వాదిస్తోంది. మరోవైపు చైనాకు వ్యతిరేకంగా భారత్ పలు దేశాల మద్దతు కూడగట్టుకుంది. ముఖ్యమం అమెరికా భారత్కు అండగా నిలిచింది. ఇక చైనా మార్కెట్కు భారత్లో ఓ మంచి స్థానం కలిపించడం ద్వారా చైనా కూడా డొక్లాం అంశంపై కాస్త వెనక్కు తగ్గింది.
కుటిల బుద్ధి బయటపెట్టిన చైనా
ఫిబ్రవరి 2018లో పాకిస్తాన్ను ఉగ్రవాదదేశాల జాబితాలో చేరుస్తూ ఆ దేశానికి ఆర్థిక సహాయంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో చైనా పాకిస్తాన్కు అండగా నిలుస్తున్నామని కానీ... నిలవడం లేదని కానీ చెప్పకుండా తటస్థంగా నిలిచింది. ఇక అదే ఏడాది ఏప్రిల్లో సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో... డ్రాగన్ కంట్రీ మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. చైనా, నేపాల్, భారత్ల మధ్య ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తామంటూ ప్రకటన చేసింది. ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం పూర్తి చేస్తే పోర్టులు, రైల్వేలు, రహదారులు, ఏవియేషన్, విద్యుత్, సమాచారం వ్యవస్థలను కవర్ చేస్తుందంటూ చైనా వెల్లడించింది.అయితే చైనా ప్రతిపాదనకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2018లో మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాధినేతలు అభివృద్ధిపై ఓ నిర్ణయానికొచ్చారు. అఫ్ఘానిస్తాన్లో చైనా భారత్లు కలిసి అక్కడి మానవవనరుల అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచన చేశారు. దీనికి చైనా ప్రతిపాదించిన ఆర్థిక కారడార్కు ఎలాంటి సంబంధం లేదు.
ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
ఇక పాకిస్తాన్లో చైనా పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని పాకిస్తాన్పై ఒత్తిడి వస్తోంది. ఒకవేళ చైనా పాకిస్తాన్ల మధ్య ఆర్థిక కారిడార్ నిర్మాణం పూర్తయితే... తమ సమస్యలు కొంత వరకు పరిష్కరించబడుతాయని పాక్ భావించింది. కానీ అది సాధ్యపడలేదు. భవనాలు, వంతెనలు, రహదారుల నిర్మాణం కోసం కావాల్సిన ముడిసరుకులు పాకిస్తాన్ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. వీటన్నిటికీ కావాల్సిన మెషినరీ కూడా కొనుగోలు చేయాల్సి ఉంది. వీటిని దిగుమతి చేసుకోవాలంటే 27 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. అయితే చైనా నుంచి దిగుమతి చేసుకునే మెషినరీ కోసం చైనా నుంచే రుణాలు పొంది ఆదేశానికి చెల్లించే ఆస్కారం ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన పాకిస్తాన్ను గట్టెక్కించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అంతర్జాతీయ మోనిటరీ ఫండ్ బెయిల్ అవుట్ ప్రకటించక తప్పలేదు. ఇప్పటికే ఆదేశానికి 12 సార్లు బెయిల్ అవుట్ ప్రకటించడం జరిగింది. ఇలా 1988 నుంచి జరుగుతోంది. ఇక ఆర్థిక కారిడార్ నిర్మాణం కోసం ఇదే ఇబ్బందులు పాకిస్తాన్కు ఎదురవుతున్నాయి. ఇక మరో బెయిల్అవుట్ ఇవ్వాలంటే ఐఎమ్ఎఫ్కు అతిపెద్ద వాటాదారుడిగా అమెరికా ఉంది. అయితే చైనాతో అమెరికాకు బేధాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ప్రభావం పాకిస్తాన్ బెయిల్ అవుట్పై పడే అవకాశం ఉంది. బెయిల్ అవుట్ తీసుకోవద్దని చైనా పాకిస్తాన్కు సూచించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పాక్ ఆర్థికభారాన్ని డ్రాగన్ కంట్రీ మోయాల్సి వస్తుంది.
పాక్లో చైనా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరాదు
ఏప్రిల్ 2018లో జరిగిన అంతర్జాతీయ మోనిటరీ ఫండ్ నిర్వహించిన సమావేశంలో చైనాకు పరోక్షంగా హెచ్చరికలు జారీచేసింది. ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన దేశాల్లో నిర్మాణాలు చేపట్టడం సరైన పని కాదని ఐఎమ్ఎఫ్ ఛీఫ్ క్రిస్టీన్ లగార్డే చైనాను హెచ్చరించారు. ఇక చైనాలో ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మందగించడంతో ఆర్థిక కారిడార్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చుకోవడంలో చైనాకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ దేశాలను చైనా సహాయం అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో దుబాయ్, సింగపూర్, జ్యూరిచ్, లండన్లాంటి దేశాలను చైనా ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోడ్లు మరియు భవనాల నిర్మాణం చాలా కాంప్లికేటెడ్గా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అమెరికాలాంటి అగ్రరాజ్యాలు తమ ఉనికిని చాటేందుకు లేదా ప్రపంచంలో తామే గొప్పవారం అని చెప్పుకునేందుకు ఇలాంటి ప్రాజెక్టులు తామే తీసుకుని పూర్తి చేసే అవకాశం ఉంది.