భారత్ స్టాండ్ వెరీ క్లియర్... తేల్చుకోవాల్సింది చైనానే... మాటలు చేతలతో సరితూగేనా...?
చైనాతో సరిహద్దులో సైన్యం ఉపసంహరణపై భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల సంయుక్త స్మారక స్టాంపుల విడుదల భారత్ కారణంగా రద్దయిందని చైనా ఆరోపించడాన్ని భారత్ తోసిపుచ్చింది. భారత్-చైనా దౌత్య సంబంధాలు 70వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంయుక్త స్మారక స్టాంపులను విడుదల చేయాలని భావించాయి. అయితే ఇందుకు భారత్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయినట్లు చైనా ప్రకటించింది.
Recommended Video
చైనా చర్యల ఫలితమే సరిహద్దు ప్రతిష్ఠంభన...
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ' తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఏకపక్షంగా స్టేటస్ కోను మార్చేసేందుకు చైనా చేసిన చర్యల ఫలితమే గత ఆర్నెళ్లుగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు కారణం. సరిహద్దులో శాంతి,ప్రశాంతతను నెలకొల్పాలన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు చైనా తూట్లు పొడిచింది. ఇరు దేశాలు 1993,1996 నాటి ద్వైపాక్షిక ఒప్పందాలు,ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాల్సిందే.' అని పేర్కొన్నారు.
మాటలు,చేతలతో సరితూగేనా..?
'ద్వైపాక్షిక ఒప్పందాలను పాటించేందుకు,సామరస్య పూర్వక చర్చల ద్వారా సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామన్న చైనా ప్రకటనలను మేము గమనిస్తున్నాం. అయితే ఆ మాటలు చేతలతో ఎంతవరకూ సరితూగుతాయో చూడాలి. మున్ముందు జరగబోయే చర్చల ద్వారా సరిహద్దు ప్రతిష్ఠంభనకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం. పరస్పర అంగీకారంతో వీలైనంత త్వరగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణతో పాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు ఉపయోగపడుతాయని భావిస్తున్నాం.' అని శ్రీవాస్తవ తెలిపారు.
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్...
భారత్-చైనా దౌత్య సంబంధాలు 70వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టాలనుకున్న సంయుక్త స్మారక స్టాంపుల విడుదల కార్యక్రమం భారత్ కారణంగా రద్దయిందన్న ఆరోపణలను అనురాగ్ శ్రీవాస్తవ తోసిపుచ్చారు. 70వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ఇంకా ప్రారంభం కాలేదన్న విషయాన్ని గమనించాలని... కాబట్టి రెండు దేశాల ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు పెద్దగా అడ్డంకులు ఏమీ ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.
భారత్పై రష్యా ఆరోపణలు..
శుక్రవారం(డిసెంబర్ 11) రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై స్పందించారు. 'భారత్ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల నిరంతర దూకుడు,వంచక విధానానికి ఒక వస్తువుగా మారింది. ఎందుకంటే వారు క్వాడ్ అని పిలవబడే ఇండో-పసిఫిక్ వ్యూహాలను ప్రోత్సహించడం ద్వారా చైనా వ్యతిరేక గేమ్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు.' అని విమర్శలు గుప్పించారు. కాగా,భారత్-చైనా మధ్య గత ఏడు నెలలుగా సరిహద్దు ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా మిలటరీ స్థాయిలో,దౌత్య స్థాయిలో చర్చలు జరిగినా గ్రౌండ్లో మాత్రం ఆ ఒప్పందాలు అమలుకావట్లేదు.