మాల్దీవుల వివాదం: భారత్ను మరోమారు హెచ్చరించిన చైనా!
న్యూఢిల్లీ: మాల్దీవుల విషయంలో చైనా మరోమారు భారత్ను పరోక్షంగా హెచ్చరించింది. మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి సాయం చేయాల్సిందిగా మల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు.
తమ దేశంలో ఏర్పడిన సంక్షోభ నివారణకు మిలిటరీ చర్యలు తీసుకోవాలంటూ ఆయన అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. భారత్ పేరు ఎత్తకుండానే.. మాల్దీవుల విషయంలో బయటి శక్తుల జోక్యాన్ని సహించబోమంటూ హెచ్చరించింది.
మాల్దీవుల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఆ దేశ అంతర్గత విషయమని, దానిని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలనేది చైనా సూచన. అంతేకాదు, సంక్షోభాన్ని పరిష్కరించుకోగల సమర్థత అక్కడి ప్రభుత్వానికి, దేశ ప్రజలకు ఉందని, చట్టప్రకారం సమస్యలను తొలగించుకుని శాంతియుత పరిస్థితులను వారే పునరుద్ధరించుకోగలరంటూ చైనా ఒక ప్రకటన కూడా చేసింది.
అయితే మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిష్కారానికి మాజీ అధ్యక్షుడు నషీద్ మాత్రం భారత సాయాన్ని అర్థిస్తున్నారు. అంతేకాదు, చైనా తమ దేశ భూభాగాన్ని ఆక్రమించిందని, అర్కిపెలాగోలో 17 దీవులు చైనా అధీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నారు.