సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత: చైనా వైమానిక బలగాలు, రాడార్లు: ధృవీకరించిన ఎయిర్ చీఫ్ మార్షల్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు కనిపిస్తోంది. లఢక్ తూర్పు సెక్టార్ పరిధిలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా తన వైమానిక బలగాలను మోహరింపజేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖకు అవతల కాపుగాసిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలకు అండగా.. వైమానిక దళాన్ని పంపించింది. వాస్తవాధీన రేఖ సమీపంలో రెండంచెల రక్షణ వ్యూహాన్ని పన్నినట్లు తేలింది.
భారత్-చైనా సరిహద్దు వివాదంలో ట్విస్ట్: గ్రేట్ మూవ్: వాస్తవాధీన రేఖ వద్ద ఏం జరుగుతోంది?
ఈ విషయాన్ని భారత వైమానికదళాధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భడౌరియా స్వయంగా ధృవీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడంచారు. తాము అంచనా వేసిన దాని కంటే పెద్ద ఎత్తున చైనా తన వైమానిక దళాన్ని లఢక్ వాస్తవాధీన రేఖ వద్దకు తరలించినట్లు పేర్కొన్నారు. దీనికి ధీటుగా తాము సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చైనా వ్యూహాలను చిత్తు చేసేలా వ్యవహరిస్తామని, దీనికోసం అన్ని జాగ్రత్తలను చేపట్టామని అన్నారు.
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రామానికి భడౌరియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ అనుసరిస్తోన్న వ్యూహాల గురించి ఆయన ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. కొంతకాలంగా లఢక్ వాస్తవాధీన రేఖ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని చెప్పారు. తాజాగా చైనా తన మోహరింపును మరింత బలోపేతం చేసిందని అన్నారు. ఆర్మీకి మద్దతుగా వైమానిక బలగాలను పిలిపించిందని పేర్కొన్నారు.
చైనా రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోందని, రాడార్లు, ఉపరితలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సంధించే సామాగ్రిని తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందని భడౌరియా అన్నారు.. దీనికి ధీటుగా తాము స్పందిస్తామని, అదే స్థాయిలో సైన్యాన్ని సరిహద్దులకు పంపిస్తున్నామని చెప్పారు. సుఖోయ్-30 ఎంకేఐ, బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే సామాగ్రిని తరలించే అవకాశాలు లేకపోలేదని అన్నారు.