ఆ ఐదుగురి కిడ్నాప్ ఉదంతంలో కీలక అప్డేట్... లెఫ్టినెంట్ కల్నల్ ఏం చెప్పారంటే...
అరుణాచల్ ప్రదేశ్లోని నాచో పట్టణానికి చెందిన ఐదుగురు యువకుల కిడ్నాప్ ఉదంతంలో భారత్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆ ఐదుగురు వ్యక్తుల ఆచూకీ దొరికినట్లు తేజ్పూర్ డిఫెన్స్ పీఆర్వో,లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్దన్ వెల్లడించారు. హాట్ లైన్ ద్వారా జరిపిన సంప్రదింపుల్లో ఆ ఐదుగురిని తమ భూభాగం వైపు గుర్తించినట్లు చైనా వెల్లడించిందన్నారు. వారిని వీలైనంత త్వరగా వెనక్కి పంపించేందుకు చైనీస్ ఆర్మీతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నామని లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్దన్ తెలిపారు. ఆ ఐదుగురు అనుకోకుండా వాస్తవాధీన రేఖను దాటి చైనా భూభాగంలోకి వెళ్లారని చెప్పారు.
ఆ ఐదుగురి ఆచూకీ తెలియడంతో నాచో గ్రామంలోని వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. సుబాన్సిరి జిల్లాలోని ఇండియా-చైనా సరిహద్దు వెంబడి ఉన్న సెరా 7 ప్రాంతం నుంచి వీరిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ అయినవారిలో తను బకర్,ప్రసత్ రింగ్లింగ్,ఎన్గరు దిరి,దొంగ్తు ఎబియా,తోచ్ సింగ్కమ్ ఉన్నారు. నిజానికి ఏడుగురు సభ్యుల బృందం అడవిలో వేటకు వెళ్లగా... వారిలో ఐదుగురు చైనా ఆర్మీ చేతికి చిక్కినట్లు కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా ఆర్మీ వర్గాలు చెబుతున్న ప్రకారం... ఆ ఐదుగురు అనుకోకుండా భారత సరిహద్దు దాటి చైనా భూభాగంలో అడుగుపెట్టారు. చైనా ఆర్మీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో వారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు,ఘర్షణలు చెలరేగుతున్న వేళ ఈ కిడ్నాప్ ఉదంతం దేశంలో తీవ్ర కలకలం రేపింది.
Chinese Army on 8th September responded on hotline and confirmed that the missing Indians have been found on their side. Formalities for their early transfer is being coordinated with the Chinese Army: Lt Col Harsh Wardhan Pande, PRO Defence, Tezpur (2/2)
— ANI (@ANI) September 8, 2020