బెంగళూరులో పోలీస్ను కొట్టిన టెక్కీ 'చైనా' భార్య
బెంగళూరు: డ్యూటీలో ఉన్న పోలీసు పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు చైనాకు చెందిన మహిళ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో బుధవారం (మంగళవారం దాటాక ఆర్ధరాత్రి) నాడు జరిగింది.
ఆ సమయంలో వారు అల్కాహాల్ తీసుకున్నారు. తాగి అనుచితంగా ప్రవర్తించిన ఆ జంటను అరెస్టు చేశారు. చైనాకు చెందిన జెస్సీ, ఆమె భర్త ప్రశాంత్లు ఏడేళ్లుగా చైనాలో ఉంటున్నారు. రెండు నెలల క్రితం వారు భారత్ వచ్చారు.
బెంగళూరులోని సాఫ్టువేర్ సంస్థలో ప్రశాంత్ పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో వారు తప్పతాగి రోడ్డు పైన వెళ్తూ కింద పడ్డారు. వారిని గమనించిన పోలీసులు సహాయం చేసేందుకు వచ్చారు.
అయితే, జెస్సీ సదరు పోలీసుతో అసభ్యంగా మాట్లాడింది. అంతేకాదు అతని పై చేయి చేసుకుంది. దీనిని రికార్డ్ చేస్తున్న పోలీస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం లంచం కావాలా.. ఎంత కావాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. పోలీసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తే వినలేదు.
ఓ పోలీసు మాట్లాడుతూ.. తాము వారికి సాయం చేసేందుకు వెళ్తే, ఎంత లంచం కావాలని అడిగిందని, అందుకు సంబంధించి వీడియో కూడా ఉందని చెప్పారు. మీకందరికీ డబ్బే కావాలని, ఎంత కావాలో చెప్పాలని ఆమె తమను అన్నారని చెప్పింది.