పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా: భారత్-చైనా విదేశాంగ మంత్రుల లంచ్ మీటింగ్? ఏం జరుగుతుందో?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య తాజాగా చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం అనంతరం..రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వార్నింగ్ షాట్ ఫైరింగ్పై అటు చైనా, ఇటు భారత్.. రెండూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. కాల్పుల బాధ్యత తమది కాదంటూ చెబుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది.
భారత్తో మాటల యుద్ధం: ఇండియన్ ఆర్మీ డేంజరస్ మూవ్: మా వాళ్లు మంచోళ్లు: చైనా
ఈ పరిణామాల మధ్య మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తోన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో చైనా కౌంటర్ పార్ట్ వాంగ్ ఈ భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య లంచ్ మీటింగ్ ఏర్పాటు కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కొనసాగుతోంది.
ఈ సమావేశానికి హాజరు కావడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇప్పటికే రష్యా బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. గురువారం చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ కూడా మాస్కోలో వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ శాఖ మంత్రితో కలిసి వారిద్దరూ లంచ్ మీటింగ్లో పాల్గొనవచ్చని గ్లోబల్ టేమ్స్ అంచనా వేసింది. వారిద్దరి మధ్య ఈ భేటీ ఉంటుందా? లేదా? అనేది రెండు దేశాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చైనా అధికారిక మీడియాగా గుర్తింపు ఉన్న గ్లోబల్ టైమ్స్ ఈ మేరకు అంచనా వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలావుండగా.. రెండు దేశాల మధ్య ప్రస్తుతం సరిహద్దు వివాదాలు నెలకొనడం, అది కాస్తా పతాకస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-చైనా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం ఏర్పాటైతే.. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ రష్యా ఇప్పటిదాకా ఎక్కడా ప్రకటించలేదు. ఈ విషయంలో స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదించినా.. రెండు దేశాలూ అంగీకరించలేదు. ఇక రష్యా ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది.