చైనా దుందుడుకు చర్య.. భారత సరిహద్దు గగనతలంపై విమానాలతో చక్కర్లు..
సిక్కీంలోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి కొద్దిరోజుల క్రితం భారత్,చైనా ఆర్మీ మధ్య ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే చైనా మిలటరీకి చెందిన కొన్ని హెలికాప్టర్లు లడఖ్లోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో చక్కర్లు కొట్టడాన్ని భారత ఎయిర్ ఫోర్స్ గుర్తించింది.
ట్రంప్ అరికాలి మంట నెత్తికెక్కేలా: కరోనాపై అడ్డంగా వాదిస్తోన్న చైనా: వుహాన్లో పుట్టలేదంటూ
చైనా దుందుడుకు చర్య పట్ల అప్రమత్తంగా వ్యవహరించిన భారత్ వెనువెంటనే యుద్ద విమానాలతో లడఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ చేపట్టింది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వమే ఈ ఆపరేషన్స్ను గోప్యంగా ఉంచాలని చెప్పినట్టు సమాచారం. అయితే చైనా హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించలేదని ఎయిర్ఫోర్స్ నిర్దారించింది. నిజానికి గతంలోనూ చైనా భారత్ లడఖ్ సెక్టార్లోని గగనతలంలోకి ప్రవేశించింది.
లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో భారత్కు రెండు ప్రధాన వైమానిక దళ స్థావరాలు ఉన్నాయి. అందులో లేహ్ ఒకటి. సాధారణంగా సుఖోయ్ 30MKI యుద్ద విమానాలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ లడఖ్లోని లేహ్ నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఎప్పుడూ గస్తీ కాస్తుంటుంది. ఇక్కడ ఫైటర్ జెట్ విమానాలను శాశ్వతంగా మోహరించనప్పటికీ.. ఏడాది పొడవునా యుద్ద విమానాలతో నిఘా చేపడుతూనే ఉంటారు.
మరోవైపు పాకిస్థాన్ను హంద్వారా ఎన్కౌంటర్ భయం వెంటాడుతోంది. జమ్మూకశ్మీర్లోని హంద్వారా ఎన్కౌంటర్లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సహా ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో భారత్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే అనుమానంతో పాకిస్థాన్ తమ గగనతలంలో విమానాలతో గస్తీ పెంచింది. రోజువారీ విమానాలతో పాటు ఎఫ్ -16, జేఎఫ్-17 వంటి యుద్ధ విమానాలతో గస్తీ చేపట్టింది. అటు పాక్,ఇటు చైనా ఇరు దేశాల విమానాలు భారత గగనతలానికి సమీపంలో చక్కర్లు కొడుతుండటంతో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.