బెంగళూరులో చైనీయుడిపై కత్తితో దాడి
బెంగళూరు: బెంగళూరులో నగరంలో చైనా పౌరుడిపై ఐదుగురు దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఓ బిజినెస్ డీల్ కుదుర్చుకునేందుకు యాన్ అనే చైనా పౌరుడు బెంగళూరుకు వచ్చాడు.
ఇందిరానగర్లో క్యాబ్ కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు యాన్ వద్ద ఉన్న వస్తువులను దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. యాన్ ప్రతిఘటించడంతో కత్తులతో అతని ముఖంపై దాడి చేశారు.
వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన యాన్.. సాయం కోసం కేకలు వేశాడు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘర్షణలో యాన్ ముఖానికి గాయమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
Arrested the accused who had assaulted a Chinese citizen within 5 days seized 2 bikes @CPBlr @AddlCPEast @BlrCityPolice
— AJAY HILORI, IPS (@DCPEASTBCP) July 31, 2017
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం యాన్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో మణి(23), మణికంఠ(20), విజయ్(22), అరుణ్ కిరణ్(20), శరత్(25)లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా గతంలోనూ నేరాలకు పాల్పడ్డవారేనని చెప్పారు.