భారత్ను విడిచి వెళ్లండి..చైనా ప్రతినిధులకు నోటీసులు..హైకోర్టుకు చేరిన మ్యాటర్
ముంబై: చైనాకు చెందిన ఓ మొబైల్ కంపెనీ మేకిన్ ఇండియాలో భాగంగా తన ఉత్పత్తి కేంద్రాన్ని డామన్ అండ్ సిల్వాసాలో ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు చైనా నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు 60 మందిని వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. వారు బిజినెస్ వీసాకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు భారత అధికారులు పేర్కొన్నారు. అయితే నోటీసులపై కంపెనీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
చైనా దేశీయులు క్రిస్మస్ లోగా భారత్ను విడిచి తమ దేశానికి వెళ్లాలంటూ ఇచ్చిన నోటీసులపై ఆ కంపెనీ తరపున భారత న్యాయవాది నౌషర్ కోహ్లీ జస్టిస్ బీపీ ధర్మాధికారి, సారంగ్ కొత్వాల్ ముందు హాజరయ్యారు. తమ వీసాలు ఇంకా చెల్లుబాటులో ఉన్నప్పటికీ భారత అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఇప్పటికే కొందరు దేశం విడిచి వెళ్లారని కోర్టుకు తెలిపారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. పెసిఫిక్ సైబర్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ప్లాంట్లను వారు పర్యవేక్షించేందుకు బిజినెస్ వీసాపై భారత్కు వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు కోహ్లీ. ముందస్తు సమాచారం లేకుండా 60 మంది చైనా దేశీయులకు నోటీసులు జారీచేయడంపై కోహ్లీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
భారత్లో ఆ కంపెనీతో పార్టనర్గా ఉన్న మరో కంపెనీ చైనా దేశీయులను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేసింది . ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక పరిజ్ఞానం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ కింద వీరంతా వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ ఈ ప్లాంటులో మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తుందని వాటిని పర్యవేక్షించేందుకే బిజినెస్ వీసాపై చైనా నిపుణులు వచ్చినట్లు పిటిషన్లో తెలిపారు. వచ్చిన కొందరికి డిసెంబర్ 20వరకు వీసా గడువు ఉండగా మరికొందరికి డిసెంబర్ 27 వరకు ఉందని దాదాపు చాలామందికి మే 2019 వరకు వీసా గడువు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కోహ్లీ.