ఇటు చర్చలు- అటు కుట్రలు - లడఖ్లో 10 పెట్రోలింగ్ పాయింట్స్ మూసేసిన చైనా..
భారత్ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా మరోసారి తన డబుల్ గేమ్ను బయటపెట్టుకుంది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే గల్వాన్ లోయలో భారత సైనికులకు పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ.. ఇప్పుడు మరో దుష్ట పన్నాగానికి తెర లేపింది. ఈ సారి తమకు ఇబ్బందికరంగా మారిన భారత బలగాల నిఘాను అడ్డుకునేందుకు వీలుగా తూర్పు లఢఖ్లో ఉన్న పెట్రోలింగ్ పాయింట్లపై కన్నేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కనీసం పది పెట్రోలింగ్ పాయింట్లను చైనా ఆర్మీ మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో భారత బలగాలు అటు వైపుగా వెళ్లకుండా తాత్కాలికంగా అడ్డుకున్నట్లయింది.
Recommended Video
చైనా నిఘాపై కేంద్రం సీరియస్- నిపుణుల కమిటీతో దర్యాప్తు- నెల రోజుల్లో నివేదిక...
అటు చర్చలు- ఇటు కుట్రలు...
భారత్తో ఆరునెలలుగా సరిహద్దుల్లో ముఖాముఖీ పోరాటం చేస్తున్న చైనా సైన్యం చర్చలు కొనసాగిస్తున్నా అందులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కనీసం యథాతథ స్ధితి కొనసాగిద్దామన్న భారత్ ప్రతిపాదనను సైతం పట్టించుకోకుండా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా వీటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చైనా ఆర్మీ మరో దుష్టపన్నాగానికి తెరలేపింది. చైనా బలగాల కదలికలపై పెరిగిన భారత నిఘాను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ అవకాశాలు లేకుండా చేయాలని చూస్తోంది. తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి కనీసం పది పెట్రోలింగ్ పాయింట్లను చైనా మూసేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా ఉద్రిక్తతలకు కారణమిదేనా ?
చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన, తాజా ఉద్రిక్తతలకు గల కారణాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా పార్లమెంటులో వెల్లడించారు. ఇందులోనూ ఆయన భారత బలగాల పెట్రోలింగ్ను చైనా అడ్డుకోవడం వల్లే చైనా బలగాలతో ముఖాముఖీ తప్పడం లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి కొన్ని రోజులుగా భారత బలగాల పెట్రోలింగ్ ను చైనా అడ్డుకుంటోందని తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని భారత్ అంతర్జాతీయ స్ధాయిలో చర్చకు పెడుతున్న నేపథ్యంలో చైనా ఆర్మీ మన పెట్రోలింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. దీంతో కేంద్రం కూడా దీనికి కౌంటర్ చర్యలకు వ్యూహరచన చేస్తోంది.
అర్ధం పర్ధం లేని చైనా డిమాండ్లు...
సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ కచ్చితంగా లేకపోవడంతో భారత్-చైనా బలగాలు పెట్రోలింగ్ పాయింట్ల ఆధారంగానే తమ భూభాగాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో పెట్రోలింగ్ పాయింట్ల మూసివేత ద్వారా భారత్ను అడ్డుకోవచ్చనేది చైనా ఆర్మీ పన్నాగంగా తెలుస్తోంది. మరోవైపు భారత్ ప్యాంగ్యాంగ్లోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుతో పాటు కురాంగ్ నాలా ప్రాంతంలోని కొన్ని శిఖరాల నుంచి భారత్ వైదొలగాలని చైనా బలగాలు కోరుతున్నాయి. అయితే గతంలో భారత్-చైనా మిలటరీ చర్చల్లో భాగంగా అంగీకరించిన ప్రాంతాల నుంచి మాత్రమే బలగాలను ఉపసంహరిస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక పెట్రోలింగ్ పాయింట్లను చైనా మూసేసినట్లు కనిపిస్తోంది.
ఆక్రమిత ప్రాంతంలోనే పెట్రోలింగ్ పాయింట్లు...
ఈ ఏడాది మార్చి నెల తర్వాత చైనా లఢఖ్లోని వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. దేప్సాంగ్ లోని 972 చదరపు కిలోమీటర్లు ఇందులో ప్రధానమైనది. వీటిలో దాదాపు 10 నుంచి 13 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ పెట్రోలింగ్ పాయింట్లలోనే భారత బలగాలు రాకుండా చైనా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనా ఆక్రమించినప్పటికీ ఇక్కడ ఇరు బలగాల పెట్రోలింగ్ మాత్రం కొంతకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు దీన్ని చైనా అడ్డుకున్నట్లు అర్ధమవుతోంది. తద్వారా భారత్పై మరింత ఒత్తిడి పెంచడంతో పాటు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనే పట్టుదల కనిపిస్తోందని సైన్యం చెబుతోంది.