విషం చిమ్ముతోన్న డ్రాగన్: 100 కిలోమీటర్లు భారత్ భూభాగంపై చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ
ఇటానగర్: పొరుగు దేశం చైనా మరోసారి బరి తెగించింది. ఆ దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి మళ్లీ చొచ్చుకుని వచ్చాయి. వాస్తవ సరిహద్దులను దాటుకుని అయిదు కాదు..10 కాదు.. ఏకంగా 100 కిలోమీటర్ల మేర భారత గడ్డపై ప్రవేశించి, తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఓ నదిపై అడ్డంగా చెక్క వంతెనను నిర్మించుకున్నాయి. రెండు నెలల వ్యవధిలో చైనా ఆర్మీ బలగాలు.. అక్రమంగా మనదేశ భూభాగంపైకి రావడం ఇది రెండోసారి. దేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
డీకే అరెస్ట్ సరే..సుజనా చౌదరి మాటేంటీ: బీజేపీలో చేరగానే కేసులు కోల్డ్ స్టోరేజీలో పెట్టారా?రాజ్ దీప్
భారతీయ జనతాపార్టీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు తాపిర్ గావ్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. చైనా దురాక్రమణకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఆయన మీడియాకు విడుదల చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దులకు ఆనుకుని ఉన్న అన్జావ్ జిల్లాలోని ఛగ్లగామ్ సమీపంలో దట్టమైన అడవుల మధ్య గల డొయిమ్రు నదిపై చైనా సైనిక బలగాలు ఈ వంతెనను నిర్మించినట్లు తాపిర్ వెల్లడించారు. సరిహద్దుల్లో భారత సైన్యం రేయింబవళ్లు కాపు కాస్తున్నప్పటికీ..
వారి కళ్లు గప్పి మనదేశంపైకి చొచ్చుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతాల్లో చొరబాటుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతా బలగాలను మోహరింపజేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రక్షణశాఖ అధికారుల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని తాపిర్ వెల్లడించారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి త్వరలోనే తాను ఓ వినతిపత్రాన్ని అందజేస్తానని, ఈ విషయాన్ని లోక్ సభలోనూ లేవనెత్తుతానని అన్నారు.