మోడీపై చైనా నెటిజన్ల ప్రశంసలు: భారీగా ఫాలోవర్స్, తమ ఇంటికి రమ్మంటూ ట్వీట్లు
న్యూఢిల్లీ/బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై చైనా నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చైనాలోని ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ వైబోలో మోడీ ఖాతా ప్రారంభించి, చైనీయుల భాషలో ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, వైబోలో ఖాతా ప్రారంభించిన మూడు రోజుల్లోనే మోడీ ఖాతాకు 42,170మంది ఫాలోవర్లు చేరిపోయారు. వైబోలో మోడీ చేరడం పట్ల చైనా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు ఆయనను తమ ఇళ్లకు రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపిస్తున్నారు.
మే 5న వైబోలో ఖాతా ప్రారంభించిన మోడీ.. పలు ట్వీట్లను చైనా భాషలో కూడా చేశారు. మే 14 నుంచి 16వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నట్లు కూడా ఆయన వైబోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘1984లో అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టిన రాకేష్ శర్మ గురించి చాలా మంది చైనీయులకు తెలియదు. చైనా-భారత్ సంబంధాలకు మీడియానే ప్రధాన అవరోధంగా మారుతోంది. ఇరుదేశాలకు విరుద్ధమైన సమాచారం ఇస్తోంది' అని ఫ్లైయింగ్హైబియర్ అనే పేరుతో సింగపూర్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది.
‘ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన చైనా-భారత్ల మధ్య సత్ససంబంధాలను నెలకొల్పుతుందని ఆకాంక్షిస్తున్నా. మీడియా కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కలిగేందుకు సహకరించాలి' అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.