గుడ్బై ఇండియా: భారత్లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన.. నేపాల్ వెళ్లిన జిన్పింగ్
చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశం నిర్వహించారు. ఇందుకు వేదికగా కోవలంలోని ఫిషర్మెన్ కోవ్ రిసార్ట్ వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జిన్పింగ్కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు.
విబేధాలు వివాదాలుగా మారకూడదు: మోడీ
ముందుగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ చైనాతో తమిళనాడుకు 2వేల ఏళ్లకు పైగా మంచి సంబంధాలు నడిచాయని అది సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు అని గుర్తుచేశారు. చిన్న చిన్న విబేధాలు వివాదాలుగా మారకూడదని ప్రధాని మోడీ అభిలషించారు. భారత్ చైనా దేశాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మారబోతున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. కొన్ని సున్నితమైన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోడీ పిలుపునిచ్చారు. అదే సమయంలో శాంతి ,స్థిరత్వం నెలకొనేలా రెండు దేశాలు అడుగులు ముందుకు వేయాలని అన్నారు. మంచి సంబంధాలు రెండు దేశాల మధ్య నెలకొనాలని మోడీ ఆకాంక్షించారు. వూహాన్లో తొలి అనధికారిక సమావేశం జరిగిందని గుర్తు చేసిన ప్రధాని ఆ శిఖరాగ్ర సదస్సు ఈ రోజు భేటీకి బీజం వేసిందని చెప్పారు. భారత్ చైనాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నదని మోడీ చెప్పారు.
చెన్నై పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది: జిన్పింగ్
మోడీ తర్వాత ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్... భవిష్యత్తులో ఇలాంటి అనధికారిక చర్చలు మరిన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. భారత్లో పర్యటించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న జిన్పింగ్... చెన్నై పర్యటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. మంచి ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు జిన్పింగ్. ప్రధాని మోడీతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనస్ఫూర్తిగా మాట్లాడగలిగానని జిన్పింగ్ చెప్పారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఓపెన్ హార్ట్తో మాట్లాడినట్లు జిన్పింగ్ చెప్పారు. రెండుదేశాల కంటే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు జిన్పింగ్.
జిన్పింగ్కు మోడీ గిఫ్ట్
ఇక సమావేశం అనంతరం ప్రధాని మోడీ జిన్పింగ్ను అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు తీసుకెళ్లారు. అక్కడ చేనేత వస్త్రాలకు సంబంధించి వివరించారు. హస్తకళలు, మగ్గంతో చీరలు నేసే విధానం గురించి జిన్పింగ్కు వివరించారు. పట్టుచీరలకు ప్రసిద్ధి గాంచిన కంచి పట్టు చీరను జిన్పింగ్ భార్యకు భారత్ తరపున కానుకగా ఇస్తున్నట్లు ఆయనతో మోడీ చెప్పారు. జిన్పింగ్ ఫోటో, మోడీ ఫోటో ఉన్న పట్టు శాలువాను చైనా అధ్యక్షుడికి బహూకరించారు భారత ప్రధాని . మధ్యాహ్నం జిన్పింగ్కు విందును ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ. అనంతరం కోవలంలో ప్రధాని మోడీ జిన్పింగ్కు వీడ్కోలు పలికారు.
చెన్నై నుంచి నేపాల్కు జిన్పింగ్
కోవలం నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిలు వీడ్కోలు పలికారు. ఇక చెన్నై నుంచి జిన్పింగ్ నేపాల్ రాజధాని ఖాట్మాండుకు బయలు దేరి వెళ్లారు. ఇలా స్నేహపూర్వక వాతావరణంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటన ముగిసింది.