అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా రోడ్డు బిల్డింగ్ టీమ్, బుల్డోజర్లు స్వాధీనం చేసుకున్న భారత్
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా చెబుతున్న చైనా మరోసారి రెచ్చిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ఉనికిని ఇప్పటి వరకూ గుర్తించలేదని వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అరుణాచల్ప్రదేశ్పై చైనా దురంహకార వ్యాఖ్యలు
డోక్లాం వివాదాన్ని పూర్తిగా మర్చిపోకముందే చైనా మరోసారి బరి తెగించడం గమనార్హం. భారత భూభాగంలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించింది. మెక్మోహన్ రేఖ దాటి అరుణాచల్ ప్రదేశ్లోకి చొరబడిన చైనా బలగాలు.. మన భూభాగంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నాయి. దీన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో అప్పర్ షియాంగ్ జిల్లాలోని బిషింగ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
బుల్డోజర్ల సాయంతో చైనా రోడ్డు నిర్మాణం చేపడుతోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇండో టిబటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అప్రమత్తమైంది. భారత బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించాయి. చైనాకు చెందిన రెండు బుల్డోజర్లను భారత్ స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని ఎప్పటి నుంచో వాదిస్తోన్న చైనా డిసెంబర్ 28న ఈ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో యార్లూంగ్ త్సాంగ్పో నదికి ఉత్తరాన ఉన్న మెడాగ్ ప్రాంతంలో భారత్ బలగాలను మోహరించింది. అక్కడి నుంచి వెళ్లాలని చైనా బలగాలకు హితవు పలికింది.
చైనా సైన్యం తిరస్కరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భారత సైన్యం అక్కడికి బలగాలను పంపింది. ఈ ప్రాంతాన్ని ఐటీబీపీ బలగాలు పహారా కాస్తున్నప్పటికీ ఆర్మీని భారీగా మోహరించారు.