భారత్ అదుపులో చైనా సైనికుడు- లడఖ్ సరిహద్దు దాటి చిక్కిన వైనం-ఆర్మీ విచారణ
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉందని పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. మంచు గడ్డకట్టే చలిలోనూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు పరిస్ధితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో లడఖ్ సమీపంలోని దక్షిణ ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ దాటి భారత్లోకి ప్రవేశించిన ఓ చైనా సైనికుడిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది.
Recommended Video
కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉన్న ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద చైనా సైనికుడిని ఆర్మీ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. వాస్తవాధీన రేఖ అతిక్రమించి భారత భూభాగంలోకి వచ్చిన ఇతడిని ఆర్మీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి రావడం వెనుక కారణాలను ఆరా తీస్తోంది. ఈ సైనికుడు భారత స్ధావరాలపై నిఘా పెట్టేందుకు ఇక్కడికి వచ్చాడా లేక దారి తప్పి వచ్చాడన్న అంశాలపై అతన్ని ప్రశ్నిస్తున్నారు.
చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై ఆర్మీ కానీ కేంద్రం కానీ పూర్తి స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఓ సైనికుడు చిక్కాడన్న వార్త మాత్రమ ప్రస్తుతానికి ఆర్మీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఈ ప్రాంతంలో నిఘా చర్యలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే సైనికుడిని ఉద్దేశపూర్వకంగా పంపిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.