ఆర్మీ చేతుల్లో బందీ: చైనా సైనికుడి అప్పగింత పూర్తి: 48 గంటల సుదీర్ఘ విచారణలో తేలిందేమిటి?
న్యూఢిల్లీ: భారత భూభాగంపైకి అక్రమంగా చొరబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడి అప్పగింత పూర్తయింది. సరిహద్దులను దాటుకుని భారత్లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వాస్తవాధీన రేఖ సమీపంలోని ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద అతణ్ని పీఎల్ఏ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Recommended Video
చైనా వెన్నుపోటు: భారత్పై గూఢచర్యం: లఢక్ వద్ద కలకలం: జవాన్ల చేతిలో బందీగా సైనికుడు
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 19వ తేదీన అతణ్ని భారత సరిహద్దు భద్రతా జవాన్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లఢక్ తూర్పు సెక్టార్ పరిధిలోని చుమర్-డెమ్చొక్ వద్ద అతణ్ని బంధించారు. తొలుత గూఢచర్యం కోణంలో విచారణ చేపట్టారు. భారత సరిహద్దు జవాన్ల కళ్లు గప్పి, వాస్తవాధీన రేఖ, సరిహద్దులను దాటుకుని ఆ సైనికుడు భారత భూభాగంపైకి ప్రవేశించాడని, అతని దుస్తులపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లోగో ఉండటంతో అప్రమత్తం అయ్యారు. షాంగ్షీ ప్రావిన్స్ విభానికి చెందిన వాంగ్ యా లాంగ్గా నిర్ధారించారు.
అతని వద్ద సివిల్, మిలటరీకి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల పాటు విచారించారు. అనంతరం విడిచి పెట్టారు. మంగళవారం రాత్రి ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద వాంగ్ను చైనా ఆర్మీ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అతని వద్ద ఎలాంటి సమాచారాన్ని అధికారులు సేకరించారనేది తెలియరావాల్సి ఉంది. వాంగ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మిలటరీ, సివిల్ డాక్యుమెంట్ల దేనికి సంబంధించినవనేది వెల్లడించలేదు. భారత్-చైనా మధ్య ఇదివరకు కుదిరిన సైనిక ఒప్పందాలకు అనుగుణంగా వాంగ్ యా లాంగ్ను ఆ దేశానికి అప్పగించామని తెలిపారు.
తమ వద్ద బందీగా ఉన్న సమయంలో అతనికి అన్ని రకాల సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు. వైద్య అవసరాలను తీర్చినట్లు చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద అతి శీతల వాతావరణం ఏర్పడుతోందని, దీనికి అనుగుణంగా అతని ఆక్సిజన్ కిట్స్, నాణ్యమైన ఆహారం, ఉన్ని దుస్తులను అందించామని అన్నారు. ఆ సైనికులు పట్టుబడ్డ చుమర్-డెమ్చొక్ వద్ద రెండు దేశాల వైపునా 50 వేల మంది సైనికులు పహారా కాస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలా భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చాడనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు.