భారత్ ఔదార్యం- వాస్తవాధీన రేఖ వద్ద చిక్కిన చైనా సైనికుడు- వెనక్కి పంపాలని నిర్ణయం
భారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా పలుమార్లు మిలటరీ, విదేశాంగమంత్రుల స్ధాయిలో చర్చలు జరిగినా చైనాతో వివాదం సద్దుమణగలేదు. ఇప్పటికీ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచుగడ్డ కట్టే పరిస్ధితుల్లో ఇరుదేశాల సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూనే ఉన్నారు.
Recommended Video
ఇలాంటి పరిస్ధితుల్లో చైనాకు చెందిన ఓ సైనికుడు వాస్తవాధీన రేఖ దాటి భారత్లోకి ప్రవేశించాడు. మామూలుగా అయితే ఆ సైనికుడిని భారత్ బంధించి విచారణ జరపాలి. గూఢచర్యం ఆరోపణలు మోపి పూర్తిస్ధాయి విచారణ జరిపాక దోషిగా తేలితే భారత చట్టాల ప్రకారం శిక్ష కూడా విధించాలి. కానీ అక్కడే భారత్ విజ్ఞత ప్రదర్శించింది. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్దితులు, చైనాతో సాగుతున్న మిలటరీ స్ధాయి చర్చలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని పీఎల్ఏ సైనికుడిని ఆ దేశానికి సురక్షితంగా పంపేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది.
భారత్కు తూర్పు లడఖ్లోని డెమ్చోక్ సెక్టార్లో పట్టుబడిన ఆ చైనా సైనికుడిని కార్పోరల్ వాంగ్ లా యాంగ్ గా గుర్తించారు. అతన్ని పట్టుకున్న తర్వాత తగిన వైద్యసదుపాయాలు కల్పించి, భోజనం కూడా పెట్టారు. అతను పొరబాటున సరిహద్దు దాటి మన భూభాగంలోకి వచ్చి ఉండొచ్చని ఆర్మీ భావిస్తోంది. అందుకే నిబంధనల మేరకు అన్ని లాంఛనాలు పూర్తి చేశాక అతన్ని చుషుల్-మాల్దో మీటింగ్ పాయింట్ వద్ద చైనాకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఆరోపణలతోనే పాకిస్తాన్కు చిక్కిన కుల్ భూషణ్ యాదవ్ను ఆ దేశం ఇంకా అప్పగించకుండా విచారణ పేరుతో కొన్నేళ్లుగా వేధిస్తోంది.