లడఖ్ ప్రాంతంలోకి చైనా వాహనాలు: వెనక్కి పంపిన స్థానికులు, ఐటీబీపీ జవాన్లు
శ్రీనగర్: లడఖ్లోని లేహ్ జిల్లాలో చైనాకు చెందిన రెండు వాహనాలు కనిపించడం కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. అయితే, ఆ వీడియోపై చిత్రీకరించిన తేదీ లేకపోయినా కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని లడఖ్ అభివృద్ధి మండలి ప్రతినిధి ఇషే స్పాల్ జంగ్ మీడియాకు తెలిపారు.
స్థానిక సంచార జాతులవారు పశువులను మేపడానికి చాంగ్తాంగ్ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చైనా బలగాలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని తెలిపారు. 5 నిమిషాల 26 సెకన్ల నిడివి ఉన్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది.
సివిల్ డ్రెస్లో ఉన్న చైనా సైనికులు వారి వాహనాలు మన భూభాగంలోకి వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. స్థానికులతోపాటు ఐటీబీపీ జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుదిరుగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, ఈ విషయంపై భారత సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Recommended Video
కాగా, ఈ ప్రాంతంలో ఎక్కువగా టిబెట్కు చెందిన శరణార్థులు నివసిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను ఉపసంహరించుకోవాలని ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా ఇలాంటి కుట్రలు చేయడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల సైనికాధికరులు బలగాల ఉపసంహరణపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మరోసారి పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించి, మరోమారు త్వరలో చర్చలు జరపనున్నాయి.