చైనా మరోసారి: 1800మంది సైన్యంతో డోక్లాంలో మకాం, ఉద్రిక్తత
న్యూఢిల్లీ: చైనా మరోసారి తన దుర్భుద్ధిని చాటుకుంటోంది. భారత్-భూటాన్- టిబెట్(చైనా) సరిహద్దు ప్రాంతం డోక్లాంలో మరోసారి చైనా తన సైనిక బలగాలను మరోసారి మోహరించింది. శీతాకాల క్యాంపు అని చెబుతూ.. సుమారు 1800 మంది చైనా సైనికులు చేరుకోవడం గమనార్హం.
ఆ సమీప ప్రాంతంలోనే రెండు హెలిప్యాడ్లను ఇప్పటికే నిర్మించిన చైనా.. రహదారుల విస్తరణ పనులు కూడా మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, అక్కడ తాత్కాలిక గుడారాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు.
డోక్లాం వివాదం..
ఈ సంవత్సరం ఆరంభం నుంచే డోక్లా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. డోక్లాం ప్రాంతంలో అక్రమంగా చైనా కడుతున్న రహదారి నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఇరు దేశాల బలగాలు..
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ఇరుదేశాల సైన్యమూ భారీ ఆయుధాలను తరలిస్తూ యుద్ధ వాతావరణాన్ని తలపించేలా చేశాయి. చైనాకు ధీటుగా భారత్ కూడా బలగాలను మోహరించింది.
చైనా యుద్ధ రిహార్సల్స్ కూడా..
చైనా అయితే ఒకడుగు ముందుకేసి సరిహద్దుకు సమీప ప్రాంతంలోనే యుద్ధ రిహార్సల్స్ చేయడం మరింత ఆందోళనకు గురిచేసింది. చైనా దళాలు ముందుకు రావడంతో భారత దళాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఇరుదళాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
వెనక్కి వెళ్లిన చైనా.. మళ్లీ ఇప్పుడు..
భారత్ వెనక్కి తగ్గకపోవడంతో తప్పనిపరిస్థితుల్లో చైనా దళాలు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. దీంతో సమస్య సద్దుమణిగిందనుకుంటే.. తాజాగా, మరోసారి చైనా తన దళాలను మోహరించడం ఉద్రిక్తతలకు తెరలేపింది.