మసీదు విషయంలో ప్రశ్నించరేం: ఎట్టకేలకు శబరిమలలోకి మహిళల ఎంట్రీపై స్పందించిన చినజీయర్
హైదరాబాద్/చెన్నై: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వివాదంపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఎట్టకేలకు స్పందించారు. శబరిమల ఆలయంలోకి పదేళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలను కూడా అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదమైంది. ఈ తీర్పుపై మహిళలు సహా భక్తులు, హిందూసంస్థలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.
శబరిమలలో అర్ధరాత్రి టెన్షన్.. పోలీసుల ఆంక్షలపై భక్తుల నిరసన
ఈ అంశంపై తాజాగా చినజీయర్ స్వామి స్పందించారు. ప్రతి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, దేవుడిపై నమ్మకం ఉంటే వాటిని గౌరవించాలని లేదంటే వాటి జోలికి వెళ్లవద్దని ఆయన అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు.
మసీదు విషయంలో జోక్యం చేసుకుంటారా?
శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది కానీ, మసీదు విషయంలో ఇలాగే ఎందుకు ప్రశ్నించదని చిన్నజీయర్ స్వామి ప్రశ్నించారు. దేవాలయాలు, శాస్త్రాల విషయంలో రాజకీయాల జోక్యం ఎక్కువ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు హిందూ ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఉండటం ఏమాత్రం సరికాదన్నారు. దేవాలయాలలో జోక్యం ఏమిటన్నారు.
నమ్మకం ఉంటే గౌరవించండి, లేదంటే వదిలేయండి
రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు, బాధ్యతలు కల్పించిందని చిన్నజీయర్ స్వామి చెప్పారు. సమాజానికి ప్రమాదం లేకుండా ప్రిత ఒక్కరూ స్వేచ్ఛ పొందే హక్కు ఉందని చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామి విషయంలోను నమ్మకం ఉన్న వాళ్లు గౌరవించాలని, లేదంటే వదిలేయాలని సూచించారు. శాస్త్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఇతరుల జోక్యం సరికాదన్నారు.
ఎవరి స్వేచ్ఛ వారిది
సుప్రీం కోర్టు కూడా రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరించాలని చిన్నజీయర్ స్వామి అన్నారు. రాజ్యాంగం శాస్త్రాలకు కల్పించిన హక్కులపై ఇతరులు కల్పించుకోవడం సరికాదని చెప్పారు. కేవలం అయ్యప్ప ఆలయం పైనే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని నిలదీశారు. మసీదుల విషయంలో ఎందుకు ఎవరూ స్పందించడం లేదన్నారు. కొంతమంది రాజకీయ జోక్యం చేసుకొని ఆలయాల మీదనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. సమాజానికి ప్రమాదం లేకుండా ఎవరి స్వేచ్ఛను వారు పొందే హక్కు ఉందన్నారు.
ప్రతి ఆలయానికి నిబంధనలు
ఒక్క శబరిమల ఆలయానికి మాత్రమే కాదని, ప్రతి ఆలయానికి ఈ తరహా నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కోర్టులు నడుచుకోరాదని చెప్పారు. సమాజం బాగుండాలంటే సమాజంలోని మనుషులతో సమానంగా జంతువులు, పక్షులు, చెట్లు, ితర జీవరాశులను గౌరవించాలని, స్నేహితులు, బంధువులను సమానంగా ఆదరించాలని, అదే సమతాభావం, అందరినీ సమానంగా చూడగలిగే మనస్తత్వం కలిగి ఉండాలని, సమానత్వానికి మానవ దేహమే ఆదర్శమని, శరీరంలోని అవయవాలన్నీ సమన్వయంగా ఉంటాయని, అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. శంషాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట భగవాన్ రామానుజాచార్యుల 216 విగ్రహాన్ని నెలకొల్పుతామని, 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉంటుందని, వచ్చే ఏడాది పూర్తి కావొచ్చునని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీచే ఆవిష్కరింప చేయాలని భావిస్తున్నామని చెప్పారు.