చిరాగ్పైనే ఎల్జేపీ ఆశలు: పాశ్వాన్ లేని లోటును పూడుస్తారా...? ఓటర్లను మెప్పిస్తారా..?
బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎల్జేపీకి పెద్ద షాక్.. రాం విలాస్ పాశ్వాన్ మృతి. ఇన్నాళ్లు తండ్రి చాటు కుమారుడిగా పార్టీ బాధ్యతలను నిర్వహించిన చిరాగ్ పాశ్వాన్కు ఎన్నికల్లో పోటీ కత్తీ మీద సామే. హేమ హేమీలు ఉన్న బీహర్లో ఎత్తుకు పై ఎత్తు వేయడం.. విజయం సాధించడం అంతా ఈజీ కాదు. మరీ ఈ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఎలా ముందడుగు వేయనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్జనశక్తి అధినేత రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్కు కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. పాశ్వాన్ మృతి బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు. దళిత ఓట్లను ఆకట్టుకోవడం.. వ్యూహ రచన చేయడంలో పాశ్వాన్ దిట్టగా పేరొందారు. రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గం ఆయనకు పెద్ద దిక్కుగా నిలిచారు.
యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళితులు రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆనలిస్టులు చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్కు వ్యతిరేకంగా గళం విప్పాలని పాశ్వాన్ ప్రణాళికలు రచించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొద్ది రోజులకే ఆయన చనిపోయారు.
యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యత భారం పడింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనా.. ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారని విశ్లేషకులు చెబుుతుంటారు. పాశ్వాన్ లేని ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.
చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్లో బయటపడనుంది. తొలివిడత పోలింగ్లో ఎల్జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవం లేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న తలెత్తుతోంది. చిరాగ్కు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో ప్రచారం జరగుతోంది.