10 జిల్లాల టి: చిరు సహా 4గురు కేంద్రమంత్రులు రిజైన్?
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకే మొగ్గు చూపుతుండటంతో రాజీనామా చేయాలని కేంద్రమంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి వర్గం పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపనుంది!
విభజన అనివార్యమైతే రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చిరంజీవి సహా సీమాంధ్ర మంత్రులు మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. విభజనకు మొగ్గు చూపుతున్న కేంద్రం హైదరాబాదును యూటి చేయాలనే తమ డిమాండును పట్టించుకోకుంటే ఈ రోజు(గురువారం) సాయంత్రమే తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి పంపించేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
కేంద్రమంత్రివర్గంలో సమైక్యవాదం బలంగా వినిపించాలని సీమాంధ్ర నేతలు కావూరి, పళ్లం రాజులకు చెప్పగా, సమైక్యం ఒప్పుకోకుంటే రాయల తెలంగాణ డిమాండ్ చేయాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిలు కోరారు. అయితే కేబినెట్ మాత్రం హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపుతోంది! కేబినెట్ నిర్ణయం వెలువడగానే రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సీమాంధ్ర ఎంపీలు సైతం అదే బాటలో నడవనున్నారని సమాచారం.
కాగా, తెలంగాణ బిల్లును ఆమోదించనున్న కేబినెట్ ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దానిని పంపించే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి రేపటి నుండి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉండనున్న విషయం తెలిసిందే.
మంత్రుల ఇళ్ల వద్ద భద్రత
పది జిల్లాల తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలపనుందనే వార్తల నేపథ్యంలో సీమాంధ్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మంత్రుల ఇళ్ల వద్ద పోలీసు భద్రతను పెంచారు. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇంటి వద్ద బలగాలను మోహరించారు.