కక్కుర్తి: బాత్రూం బోషాణాల గుట్టు రట్టయిందిలా..
వ్యాపారి, రాజకీయ నేత వీరేంద్ర నివాసంలో బాత్రూం బోషాణం గుట్టు చాలా విచిత్రంగా బయటపడింది. ఇందుకు కారణం ఆయనే కావడం మరో విచిత్రం...
బెంగళూరు: రాజకీయ నాయకుడు, వ్యాపారి కెసి వీరేంద్ర నివాసంలోని బాత్రూం బోషాణం గుట్టు అనూహ్యంగా రట్టయింది. ఇందుకు వీరేంద్ర కక్కుర్తే కారణం కావడం విశేషం. దాన్ని నిర్మించిన కార్మికులకు కూలీ డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో అది బయటపడినట్లు తెలుస్తోంది.
వీరేంద్ర నివాసంలోని బాత్రూంలోకి వెళ్తే మరో గది ఉన్నట్లు అనుమానం కూడా రాదు. సినిమాల్లో మాదిరిగా సీక్రెట్ బటన్ నొక్కితే గానీ అది తెలిసే అవకాశం లేదు. సీక్రెట్ బటన్ నొక్కితే టైల్స్లో కలిసి టైల్స్గా కలిసిపోయిన ఓ ద్వారం తెరుచుకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ డిటెక్టివ్ సినిమాల్లో విలన్ గది మాదిరిగా అన్న మాట.
సీక్రెట్ బటన్ నొక్కిన ఆదాయం పన్ను శాఖ అధికారులకు దిమ్మదిరిగే నగదు, బంగారం కనిపించాయి. రూ.5.7 కోట్ల నగదు, కోటి రూపాయల విలువ చేసే బంగారం వారి చేతికి చిక్కాయి. కర్ణాటక చిత్రదుర్గ జిల్లా చల్లకెరేలో కేసీ వీరేంద్ర మూడు ఇళ్లలో అలాంటి బోషాణాలు వెలుగు చూశాయి.
ఈ బోషాణాల వ్యవహారం వీరేంద్ర కక్కుర్తి బుద్ధితోనే బయటపడిందని అంటున్నారు. గోవాలో క్యాసినో బిజినెస్ వ్యాపారం నిర్వహించే కేసీ వీరేంద్ర తన కోసం, తన ఇద్దరు తమ్ముళ్ల కోసం ఇళ్లు నిర్మించే క్రమంలోనే బోషాణాల నిర్మాణానికి పథక రచన చేశాడు.తనకు తెలిసిన వారి నుంచి ఈ పనిలో నిష్ణాతులైన కార్మికులను ఎంపిక చేసుకున్నాడు.
బాత్రూం గోడల్లో ఓ గది ఉందని యజమానికి కూడా తెలియని స్థాయిలో వారు అద్భుతంగా లాకర్ను నిర్మించిపెట్టారు. తాను సంపాదించిన సొమ్మును వీరేంద్ర ఆ లాకర్లలో భద్రపరిచాడు. తముళ్లతో కలిసి కొత్త ఇళ్లలోకి మారాడు. అయితే, వీరేంద్ర కార్మికుల నైపుణ్యానికి తగ్గట్లుగా వారికి కూలీ ఇవ్వలేదని అంటారు.
దాంతో మండిపోయిన ఓ కూలీ విషయాన్ని వీరేంద్ర సన్నిహతులకు చెప్పాడని, అది చివరకు ఐటి అధికారుల చేరిందని అంటున్నారు. అంత డబ్బును కూడబెట్టిన వీరేంద్ర కార్మికులకు కూలీ ఇచ్చే విషయంలో ప్రదర్శించిన పిసినారి తనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.