జయకు అత్యంత ఆప్తుడు చో రామస్వామి కన్నుమూత: రమ్యకృష్ణ మేనమామ
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4.40గంటలకు మృతిచెందారు.
చెన్నై: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4.40గంటలకు మృతిచెందారు. ఆయన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు.
ఆమెతో కలిసి అనేక సినిమాలు, నాటకాల్లోనూ నటించారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తుగ్లక్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ రాజకీయ విశ్లేషణలు చేశారు.
దేశంలోని అనేకమంది రాజకీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన 1999-2005 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కాగా, రామస్వామి.. సినీనటి రమ్యకృష్ణ మేనమామ.
రామస్వామి మృతికి ప్రముఖుల నివాళి
రామస్వామి మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 'చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవ్వరికీ భయపడని వ్యక్తి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం' అని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా.. చో రామస్వామి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. చో రామస్వామి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి వారి గురించైనా రాసేందుకు ఆయన ఏమాత్రం భయపడేవారు కాదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.