బస్తీ మే సవాల్: ప్లేస్ నువ్వు చెప్పు, నేనొస్తా, దమ్ముంటే కాల్చు..? ఠాగూర్కు ఓవైసీ సవాల్
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్ వ్యతిరేకిస్తోన్న దేశద్రోహులను కాల్చివేయాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. కేంద్రమంత్రి కామెంట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇటీవల ఢిల్లీలో ఎన్నికల ర్యాలీలో అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించేవారిని కాల్చివేయాలని కామెంట్ చేశారు.
సవాల్..
‘ఎక్కడి రావాలో చెప్పండి, ఆ ప్రాంతానికి వస్తా.. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించే వారిని కాల్చేస్తా అని మీ కామెంట్లతో భయపడడం లేదు. ఆ చర్యలను నిరసిస్తూ వేలాదిమంది తల్లులు, సోదరులు రోడ్డుమీదికొస్తున్నారు. దేశాన్ని కాపాడుకొనేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో మీరు కాల్చేస్తా అని చెబితే భయపడేది మాత్రం లేదు' అని ఒవైసీ స్పష్టంచేశారు.
కాల్చిపారేయండి..
సోమవారం రిథాలా నియోజకవర్గ అభ్యర్థి మనీశ్ చౌదరి కోసం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం నిర్వహించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడున్న వారితో కూడా స్లోగన్స్ చేయించారు. గతనెలలో బీజేపీ నేత కపిల్ మిశ్రా ఇలాంటి కామెంట్ చేయగా.. తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈసీ నోటీసు
ఠాకూర్ నినాదాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అతనికి షోకాజు నోటీసు జారీచేసింది. వ్యాఖ్యలపై జనవరి 30వ తేదీ మధ్యాహ్నం లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కానీ కేంద్రమంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు వెనకొసుకొచ్చారు. అందులో తప్పేముందని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
నిరసన సెగ
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతోన్నాయి. నిరసనల వల్ల పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇందులో 11 మంది యూపీకి చెందినవారు ఉన్నారు. విపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు.. సీఏఏపై తమ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు.