అతని తలనరికి పార్లమెంటు గుమ్మానికి వ్రేలాడదీయండి: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒక ప్రతిపక్ష ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మరో అధికారపక్ష నేత ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నిండు సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ ప్యానెల్ స్పీకర్ రమాదేవిపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేత అఫ్తాబ్ అద్వానీ ఖండిస్తూ.... అజాం ఖాన్ తలను నరికి పార్లమెంటు గుమ్మానికి వ్రేలాడదీయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇలా చేస్తే మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న అజాంఖాన్, అసదుద్దీన్ లాంటి వారు ఇంకోసారి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసేందుకు వణుకు పుడుతుందని అన్నారు.
"మహిళలను అవమానించిన వారిని విడిచిపెట్టకూడదు. ముందు జయప్రదను అవమానపర్చిన అజాం ఖాన్ ఇప్పుడు మరో ఎంపీని అవమానించారు. ఇప్పటికే చాలా జరిగింది.ఈ వృద్ధ నేతకు పిచ్చి పట్టింది. పిచ్చికుక్కను కొట్టి చంపినట్లు కొట్టి చంపాలి. ఇలాంటి వాడు దేశానికి హానికరం " అని అఫ్తాబ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజాంఖాన్ దేశంలోని మంచి వాతావరణంను చెడగొడుతున్నారని అఫ్తాద్ ధ్వజమెత్తారు. మహిళలంతా ఆయన మాట్లాడే మాటలకు అవమానంగా భావిస్తున్నారని చెప్పిన అఫ్తాబ్.... రోజు రోజుకూ మహిళలంటే గౌరవం తగ్గిపోయేలా అజాం ఖాన్ మాటలున్నాయని మండిపడ్డారు. మహిళకు అవమానం జరిగితే అది దేశానికి మంచిది కాదన్నారు.
గురువారం లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరుగుతున్న సందర్భంలో మాట్లాడుతూ రమాదేవిని ఉద్దేశించి అజాం ఖాన్ ప్రస్తావించారు. "నీ కళ్లలోకి చూస్తూ మాట్లాడాలనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. వెంటనే రియాక్ట్ అయిన రమాదేవి అలా మాట్లాడటం తగదని అన్నారు. అందుకు అజాం ఖాన్ రమాదేవి తన సోదరితో సమానురాలు అని కవరింగ్ చేశారు. అజాంఖాన్ వ్యాఖ్యలపై ఒక్కసారిగా లోక్సభ దద్దరిల్లింది. అజాంఖాన్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.