రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శబరిమల ఆలయ దర్శనం రద్దు..కారణం ఇదే..!
తిరువనంతపురం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 6వ తేదీన శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పర్యటన రద్దు చేసుకోవడానికి కారణం భద్రతాపరమైన అంశాలే అని తెలుస్తోంది. రాష్ట్రపతి భద్రతకు సంబంధించి సందిగ్ధం నెలకొనడంతో పర్యటన రద్దు అయినట్లు సమాచారం. అయితే కేరళలోని కొచ్చికి 6వ తేదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తారు. అనంతరం అక్కడి నుంచి లక్షద్వీప్కు బయలుదేరి వెళతారని సమాచారం. ఢిల్లీకి తిరిగి జనవరి 9న చేరుకుంటారు.
కొచ్చి నుంచి శబరిమలకు రాష్ట్రపతి హెలికాఫ్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే చాపర్ సురక్షితమైన ల్యాండింగ్కు అనుకూలంగా లేదని పతనంతిట్ట పోలీసులు తెలిపారు. అయితే పండితావలంలోని వాటర్ ట్యాంక్పై హెలీప్యాడ్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే కోణంలో ఆలోచన చేయాలని పీడబ్ల్యూడీ దేవసమ్ బోర్డుకు సూచించింది.అయితే వాటర్ ట్యాంక్ హెలికాఫ్టర్ బరువును మోయగలదా అనే విషయంపై కూడా అధికారులు కచ్చితంగా చెప్పలేకున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అయ్యప్ప స్వామి దర్శనంకు భక్తులు పోటెత్తుతుండటంతో ఈ సమయం రాష్ట్రపతి పర్యటనకు అనువైంది కాదని జిల్లా పోలీస్ శాఖ పేర్కొంది. అంతేకాదు భద్రతాపరమైన కారణాలు చూపుతూ రాష్ట్రతి భవన్కు జిల్లా పోలీస్ చీఫ్ లేఖ రాశారు. వీటన్నిటినీ పరిశీలించిన రాష్ట్రపతి భవన్ వర్గాలు శబరిమలకు రామ్నాథ్ కోవింద్ పర్యటనను రద్దుచేశాయి.