ఇండియా సెల్యూట్స్: శిరస్సు వంచి నమస్కరిస్తోన్న భారతావని: పోలీసుల అమరవీరుల స్థూపంతో షురూ..
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆరంభించింది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం సహా చండీగఢ్, రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఆసుపత్రులపై పూల వర్షాన్ని కురిపించింది. డాక్టర్లు, నర్సులు, పోలీసులకు తమ కృతజ్ఙతను తెలియజేసింది.
Recommended Video
చండీగఢ్లో
ఈ ఉదయం 9:20 నిమిషాల ప్రాంతంలో చండీగఢ్లో టేకాఫ్ తీసుకున్న వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు హర్యానాలోని పంచ్కుల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీద ఎగిరింది. వంద అడుగుల ఎత్తు నుంచి గులాబీ పువ్వులను వెదజల్లింది. అదే సమయానికి భారత ఆర్మీ బ్యాండ్ ప్రతినిధులు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ఆసుపత్రి వద్ద డాక్టర్లు, నర్సులకు కృతజ్ఙతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మీ బ్యాండ్ ప్రతినిధులు డాక్టర్లు, నర్సులకు కృతజ్ఙతాభివందనాలు చేశారు.
న్యూఢిల్లీలో పోలీసుల అమరవీరుల స్థూపంపై..
ప్రాణాంతక కరోనా వైరస్ భయానకంగా విస్తరించడాన్ని నిలువరించడానికి అడ్డుగోడలా నిల్చున్న ఫ్రంట్లైన్ వారియర్స్లో మరో విభాగమైన పోలీసులకు వైమానిక దళం ధన్యవాదాలను తెలియజేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి లాక్డౌన్ను అమలు చేస్తోన్న సమయంలో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు పోలీసులు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయట్లేదు వారు. వారికి కృతజ్ఙతగా దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపంపై వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్లతో పూల వర్షాన్ని కురిపించారు.
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిపై..
అదే సమయానికి రాజస్థాన్ జైపూర్లోని ప్రఖ్యాత సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిపైనా వైమానిక దళానికి చెందిన చాపర్లు పూల వర్షాన్ని కురిపించాయి. జైపూర్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి టేకాఫ్ తీసుకున్న వైమానిక దళానికి చెందిన చాపర్లు నేరుగా సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రి గగనతలం మీదికి చేరుకున్నాయి. అక్కడి నుంచి పూల వర్షాన్ని కురిపించాయి. ఆ సమయంలో డాక్టర్లు, నర్సులు ఆసుపత్రి వెలుపలికి చేరుకున్నారు. వైమానిక దళం అభినందనలను అందుకున్నారు.
గోవా మెడికల్ కాలేజీ వద్ద..
పనాజీలోని గోవా వైద్య కళాశాల, ఆసుపత్రిపై వైమానిక దళ జవాన్లు హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించారు. ఈ ఉదయం 10 గంటల సమయంలో టేకాఫ్ తీసుకున్న హెలికాప్టర్ గోవా మెడికల్ కాలేజీ గగనతలం మీదికి చేరుకుని పూల వర్షాన్ని కురిపించింది. వందలాది మంది ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్య బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర హెల్త్ వర్కర్లు కాలేజీ ప్రాంగణంలో నిల్చున్నారు. ముఖానికి మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ను పాటిస్తూ వారంతా ఆసుపత్రి ఆవరణలో నిల్చోగా.. వారిపై పూల వర్షాన్ని కురిపించారు జవాన్లు.