చౌకీదార్ చోర్: నరేంద్ర మోడీపై ఉద్దవ్ థాకరే నోట రాహుల్ గాంధీ మాట
న్యూఢిల్లీ/ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలే ఉద్ధవ్ నోటి నుంచి వచ్చాయి. చౌకీదార్ చోర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీని విమర్శించేందుకు రాహుల్ పదేపదే చౌకీదార్ దొంగ అని ఆరోపిస్తుంటారు.
ఇప్పుడు ఉద్ధవ్ థాకరే నోట కూడా అదే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీతో కూటమిలో కొనసాగుతున్న శివసేన.. గత కొన్నాళ్లుగా మిత్ర పక్షంపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే లోకసభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో శివసేన పొత్తు కొనడం కష్టమేనని పరిశీలకులు అంటున్నారు.
సోమవారం సోలాపూర్ జిల్లా పండరీపూర్లో జరిగిన బహిరంగ సభలో ఉద్ధవ్ థాకరే మాట్లాడారు. ఇటీవలి రాష్ట్ర పర్యటనలో ఒక రైతు నాకు తెగులు సోకిన నిమ్మ చెట్టును చూపించారని, సాధారణంగా క్రిమి సంహారిణుల తయారీలో నిమ్మ చెట్టును వాడుతుంటారని, అలాంటిది, ఇప్పుడు ఏకంగా నిమ్మ చెట్టుకే తెగులు సోకిందని, దానిని గమనించి.. రోజులు మారాయని, కాపలా ఉండే వారే దొంగలుగా మారారు అని వారికి చెప్పానని అన్నారు.
రాఫేల్ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంపై పలు ఆరోపణలు వచ్చాయని, అలాంటప్పుడు సుప్రీం కోర్టు ఆ ఒప్పందానికి క్లీన్చిట్ ఎలా ఇచ్చిందో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. రాఫేల్ ఒప్పందంలో ఏం జరిగిందో పంటల బీమా పథకంలోనూ అదే జరిగిందని, రాఫేల్ ఒప్పందంలో అవినీతి జరగడం లేదనుకుంటే, ఇప్పటివరకు రైతులకు బీమా సొమ్ము ఎందుకు అందలేదన్నారు. 30 ఏళ్లుగా కోర్టులోనే నలుగుతున్న అయోధ్య అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.