క్రిస్టియన్ మైఖేల్ సంచలన వ్యాఖ్యలు: యూపీఏలోని నాయకుల పేర్లు చెప్పాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది
వీవీఐపీ చాపర్ అగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ వ్యాపారవేత్త క్రిస్టియన్ మైఖేల్ తన అరెస్టు అక్రమం అని చెప్పారు. తను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనను భారత్కు రప్పించడం వెనక పెద్ద కుట్రే దాగుందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి క్రిస్టియన్ మైఖేల్ను దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది సీబీఐ.
అగస్టావెస్ట్లాండ్ కేసులో తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు క్రిస్టియన్. తను ముడుపులు ఇచచినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అంతేకాదు యూపీఏ నుంచి కొందరి నేతల పేర్లు చెప్పాల్సిందిగా ప్రభుత్వం తనపై ఒత్తిడి తీసుకొస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకుందామని చెబుతోందని ఆయన వెల్లడించారు. అయితే మైఖేల్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక నిన్న అరెస్టు చేసిన క్రిస్టియన్ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టి 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే సీబీఐ తన విచారణ పూర్తి చేశాకే ఈడీ అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే ఈ కేసులోనే రెండో మధ్యవర్తిగా వ్యవహరించిన గుడో హాష్కే పై మొత్తం నింద వేయడంపై కూడా సీబీఐ, ఈడీలు కూడా ప్రశ్నించనున్నాయి. అంతేకాదు తాను నాటి ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఛీఫ్ ఎస్పీ త్యాగికి అతని కుటుంబానికి ముడుపులు ఇచ్చినట్లు తన డైరీలో రాసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలను క్రిస్టియన్ మైఖేల్ ఖండించారు. తను ఎలాంటి రాతలు రాయలేదని స్పష్టం చేశారు. అయితే ఆ రాతలు తను రాయలేదని గుడో హష్కే రాశాడని అతనిపై మోపే ప్రయత్నం చేశారు మైఖేల్.