అగస్టా కుంభకోణం కేసు: మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడం వెనక కృషి ఎవరిది..?
ఢిల్లీ: అగస్టా వెస్ట్ లాండ్ ఈ పేరు వింటే దేశంలోచాలామందికి గుర్తువచ్చేది ఓ భారీ కుంభకోణం. అగస్టా వెస్ట్లాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు విషయంలో నాటి యూపీఏ సర్కార్ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో మధ్యవర్తిగా ఉన్న బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త క్రిస్టియన్ మైఖేల్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చాలా కాలం తర్వాత పలు కోర్టు వాదనల తర్వాత ఆయన్ను దుబాయ్ నుంచి విచారణ కోసం భారత్కు తీసుకువచ్చింది ప్రభుత్వం. క్రిస్టియన్ మైఖేల్ రూ.3600 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. క్రిస్టియన్ భారత్కు రావడంతో ఆ ప్రభావం రాజకీయాలపై పడనుంది.
అజిత్ దోవల్ కృషివల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్
క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కృషి ఎంతో ఉంది. దోవల్ నేతృత్వంలోనే 'యూనీకార్న్' పేరుతో ఆపరేషన్ జరిగింది. ఈయనకు తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా సహకరించారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. మొత్తానికి వారిద్దరి కృషివల్ల దుబాయ్ అధికారులు ఓ ప్రైవేట్ జెట్లో క్రిస్టియన్ మైఖేల్ను ఢిల్లీకి పంపారు. అది మంగళవారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పదిన్నర గంటలకు చేరుకుంది. మైఖేల్పై వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెడతారు. మైఖేల్ను తీసుకువచ్చేందుకు సీబీఐకు చెందిన సాయిమనోహర్ బృందాన్ని దుబాయ్కు పంపింది ఆసంస్థ. భారత్కు అప్పగించడంలో అన్ని లాంఛనాలను పూర్తి చేసి భారత అధికారులకు అప్పగించారు దుబాయ్ అధికారులు.
హెలికాఫ్టర్ కొనుగోలు విషయంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్
ఇక హెలికాఫ్టర్ కొనుగోలు విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ఆ ఒప్పందం అగస్టా వెస్ట్లాండ్కే దక్కేలా చూశారని ఇందుకోసం పలువురి భారత అధికారులకు కమిషన్ రూపంలో ముడుపులు ఇచ్చారని సీబీఐ పేర్కొంది. ఇది బయటపడటంతో మైఖేల్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని సీబీఐ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో మైఖేల్ పై చార్జ్షీట్ తయారు చేయడం జరిగిందని సీబీఐ పేర్కొంది. యూపీఏ హయాంలో జరిగిన భారీ కుంభకోణంకు సంబంధించి అందులో కీలక వ్యక్తిని అరెస్టు చేయడం ద్వారా భారత ప్రభుత్వం విజయం సాధించిందని బీజేపీ వెల్లడించింది.
యూపీఏ సర్కార్కు చుక్కలు చూపిన అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం
2015లో మైఖేల్పై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడం జరిగిందని ఆ తర్వాత ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడంతో దుబాయ్లో ఆయన్ను 2017లో అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపడం జరిగిందని సీబీఐ తెలిపింది. మైఖేల్ తరపున లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నం విఫలమే అయ్యింది. అనంతరం దుబాయ్ కోర్టు అన్ని లాంఛనాలు పూర్తి చేసి భారత అధికారులకు అప్పగించింది. అగస్టా వెస్ట్లాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు చేసేందుకు మైఖేల్ నాటి భారత ఎయిర్ఫోర్స్ ఛీఫ్ ఎస్పీ త్యాగి అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో తేటతెల్లమైంది. అంతేకాదు అగస్టా వెస్ట్లాండ్ కంపెనీలో పనిచేస్తూ దాని ఆపరేషన్స్లో పట్టున్న వ్యక్తి మైఖేల్. తరుచూ భారత్కు వచ్చి వెళుతుండేవారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత రక్షణ రంగంలో పనిచేసే ఉన్నతాధికారులతో కలిసి కుట్రపన్నారని సీబీఐ తెలిపింది.