రైల్వేశాఖ క్రిస్మస్ గిఫ్ట్ : డిసెంబర్ 25న ఈ లగ్జరీ రైలు ప్రారంభం..టికెట్ ఎంతో తెలుసా..?
షిమ్లా: రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా హిమదర్శన్ ఎక్స్ప్రెస్ను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించనుంది. కల్కా నుంచి షిమ్లా వరకు ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రైలులో అన్ని ఆధునిక హంగులతో కూడిన ఏసీ కోచ్లు ఉంటాయి. డిసెంబర్ 24, 2020 వరకు ఈ రైలును నడపనున్నారు. విస్టాడోమ్ కోచ్లతో ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుంది. అంతేకాదు లోపల ఉన్న ప్రయాణికులు సుందరమైన ప్రదేశాలను చూసేందుకు వీలుగా రైలు కిటీకీలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
రైల్వేశాఖ ప్రకారం భారతీయ రైల్వే నెట్వర్క్పై విస్టాడోమ్ కోచ్లున్న తొలిరైలు హిమ్దర్శన్ ఎక్స్ప్రెస్ అని అధికారులు తెలిపారు. కల్కా రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరే ఈ రైలు.. షిమ్లా రైల్వేస్టేషన్కు మధ్యాహ్నం 12:55 గంటలకు చేరుతుంది. తిరిగి షిమ్లా నుంచి మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి కల్కా రైల్వే స్టేషన్కు తిరిగి రాత్రి 9:15 గంటలకు చేరుతుంది. బరోగ్ రైల్వే స్టేషన్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మొత్తం ఏడు కోచ్లతో ఈ రైలు నడుస్తుంది. ఇక విస్టా కోచ్లలో మొత్తం 15 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఫస్ట్ క్లాస్ కోచ్లో 14 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.
ప్రతి కోచ్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు ఎయిర్ కండీషనర్లు, విశాలమైన యూపీవీసీ కిటికీలు, అడ్జస్టబుల్ లేదా రివర్సిబుల్ సీట్లు ఉన్నాయి. ఇక వెస్ట్రన్ కమోడ్లు, వాటర్ జెట్, వాష్ బేసిన్, లిక్విడ్ సోప్, కంటెయినర్, స్టీల్ డస్ట్బిన్, అడర్ ఫ్రెషనర్ కంటెయినర్, టాయిలెట్ పేపర్ రోల్ వంటి సదుపాయాలున్నాయి. ఇక ఈ రైలులో ప్రయాణించాలంటే టికెట్ ధర రూ. 630 చెల్లించాలి. అయితే విస్టాడోమ్ కోచ్లలో మాత్రం ఎలాంటి కన్సెషన్ ఉండదు.