చర్చిపై దాడి, జై శ్రీరామ్ అంటూ నినాదాలు: భయపడి దాక్కున్న చర్చి ఫాదర్
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో ఓ చర్చి, స్కూలుపై కొందరు హిందు కార్యకర్తలు శనివారం తెల్లవారుజామున దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి ధర్మసేన అధ్యక్షుడు యోగేశ్ అగర్వాల్తో పాటు మరికొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కొంత మంది హిందు కార్యకర్తలు తమ చర్చి, స్కూలు ఆవరణలోకి ప్రవేశించి, ఫాదర్ ధాంక్ చన్ జోస్ మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించి, అక్కడున్న కుండీలను, ఫాదర్ ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టారని చర్చి సిబ్బంది తెలిపారు.
సంఘనటనా స్ధలం వద్ద ఉన్న రవి ఫ్రాన్సిస్ను కొట్టి, కార్యకర్తలు అక్కడికి దగ్గరలో సదస్సు జరుగుతున్న సెయింట్ థామస్ పాఠశాలకు వెళ్ళారన్నారు. అంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని తరిమేందుకు ప్రయత్నించినా, వారు సెయింట్ పీటర్ క్యాథడ్రల్కు వెళ్లి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.
అంతే కాదు ఫాదర్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల కంటపడకుండా శుక్రవారం నుంచి శనివారం వరకూ ఫాదర్ దాక్కున్నట్లు అనంతరం పోలీసులు తెలిపారు. మరోవైపు ముంబైలోని న్యూ పాన్వెల్ ప్రాంతంలోని ఓ చర్చిపై ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి సెయింట్ జార్జి క్యాథలిక్ చర్చిపై రాళ్లు రువ్వారు.