వీహెచ్పీ, భజరంగ్ దళ్ మత తీవ్రవాదులు: సీఐఏ వివాదాస్పద నిర్ణయం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్లను మత ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ తన వరల్డ్ ఫ్యాక్ట్బుక్ తాజా సంచికలో పేర్కొంది.
ఈ సంస్థలను రాజకీయ ఒత్తిడి గ్రూపుల విభాగంలో చేర్చింది. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను పెంచే ఈ సంస్థల నేతలు మాత్రం చట్టసభల్లో తలదూర్చరని వీటి స్వభావాన్ని నిర్వచిస్తూ సీఐఏ పేర్కొంది.
భారత్లో రాజకీయ ప్రెజర్ గ్రూప్స్లో ఆర్ఎస్ఎస్, హురియత్ కాన్ఫరెన్స్, జమౌతే ఉలేమా ఇ హింద్ తదితర సంస్థలను సీఐఏ పొందుపరిచింది. ఆర్ఎస్ఎస్ను జాతీయవాద సంస్థగా నిర్వచించిన సీఐఏ హురియత్ కాన్ఫరెన్స్ను వేర్పాటువాద గ్రూపుగా, జమైతే ఉలేమా ఇ హింద్ను మత సంస్థగా పేర్కొంది.
సీఐఏ ఏటా వరల్డ్ ఫ్యాక్ట్బుక్లో ప్రపంచ దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, సంస్థల వివరాలను ప్రచురిస్తుంది. అమెరికా విధాన రూపకర్తలకు, నిఘావర్గాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం మెరుగైన వనరుగా భావిస్తారు.
వీహెచ్పీ, భజరంగ్ దళ్లను మత ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడంపై సంఘ్ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపాయి.