సందర్భం అది కాదు: మాడభూషి శ్రీధర్, ఆయన ఏమన్నారు?
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పుస్తకాల పురుగు అంటూ తాను అన్నట్లు వచ్చిన వార్తాకథనంపై కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి) వివరణ ఇచ్చారు. కెసిఆర్ 70 వేల పుస్తకాలు చదివారంటూ తాను చెప్పిన సందర్భంగా ఆయన వివరించారు. దాని వెనుక సందర్భం తాను చెప్పిన ఇతర అంశాలు తెలిస్తే తానేమన్నానో అర్థం అవుతుందని ఆయన అన్నారు.
సికెఎం కళాశాలలో ఆయన ప్రసంగం ఇలా సాగింది - "కలెక్టర్ కార్యాలయం కన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయం కన్న ఒక కళాశాల గొప్పది. కలెక్టర్ ప్రధాని ముఖ్యమంత్రి కన్న ఒక ఉపాధ్యాయుడు గొప్పవాడు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యాలయంలో అనేక మంది కలెక్టర్లను, ముఖ్యమంత్రుల్ని ప్రధాన మంత్రుల్ని తయారుచేస్తాడు. అరిస్టాటిల్ లేకుండా అలెగ్జాండర్ లేడు, చాణక్యుడు లేకపోతే చంద్రగుప్తుడు లేడు, రామేశ్వరం బడిలో టీచర్లు పాఠాలు చెప్పకపోతే అబ్దుల్ కలాం లేడు".
"సి కె ఎం కళాశాల లేకపోతే నేను లేను. ఇక్కడ నేను వ్యాసాలు రాయడం నేర్చుకున్నాను. సికెఎం విద్యార్థుల రచనలతో కూడిన చైతన్య సంచిక ఎడిటర్ పదవికి వ్యాసరచన పోటీలో గెలిచి ఎడిటర్ అయ్యాను. ఎమర్జన్సీలో నా మాగజైన్ ను నిషేధించారు. విద్యార్థులకు పంచిపెట్టిన తరువాత పోలీసుల అధ్వర్యంలో తిరిగి విద్యార్థులనుంచి వసూలు చేసి ఆ సంచికలన్నీ తగల బెట్టాడు. కాని చైతన్యాన్ని తగల బెట్టలేకపోయారు. నా వ్యాసరచనా శక్తిని చంపలేకపోయారు. అక్కడ నేర్చుకున్న వ్యాసరచనల వల్లనే నేను పత్రికా రచయితనైనాను. లా ప్రొఫెసర్ గా అనేక వ్యాసాలు పుస్తకాలు రాసాను. ఆ వ్యాసాల వల్ల నేను కేంద్ర సమాచార కమిష్నర్ ను అయ్యాను. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప కళాశాలా లేక రాజకార్యాలయాలా, ముఖ్యమంత్రులు ప్రదాన మంత్రులా లేక అధ్యాపకులా అని నేను అడిగితే కళాశాల ముఖ్యం అనీ టీచర్ ముఖ్యం అని విద్యార్థిలో్కం ముక్త కంఠంతో నినదించింది" శ్రీధర్ తన ప్రసంగంలో అన్నారు.
"ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏ విధంగా చదువుకున్నాడో చెప్పాను. మాధ్యమిక తరగతులు చదవడానికి తన ఊళ్లో బడిలేకపోతే పక్కబడిలోకి కెసిఆర్ చిన్నప్పుడు వెళ్లాడు. అక్కడ ఒక టీచర్ ఆయనను తన ఇంట్లో పెట్టుకుని చదివించాడని ఓ దినపత్రిక ఆదివారం సంచికలో వివరంగా ఇచ్చారు. అక్కడ నేర్చుకున్న చదువు, ఆ టీచర్ నేర్పిన చదువు నాటిన విద్యాబీజాల వల్లనే ఆయన తెలంగాణా ఉద్యమాన్ని నడిపి తెలంగాణా రాష్ట్రం సాధించి, ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ చదువు వల్లనే 70వేల పుస్తకాలు చదివగలిగారు. (ఇది కూడా ఓ పత్రిక ఆదివారం సంచికలో నేను చదివాను). ఆ పుస్తకాల లో ఉన్న విజ్ఙానం ఆ పంతులు చెప్పిన విజఙానం ఈ రోజు రాష్ట్రపాలనకు ఉపయోగపడుతుంది" అని అన్నట్లు ఆయన వివరించారు.
పుస్తకాల పురుగు అని నేను అనలేదని శ్రీధర్ స్పష్టం చేశారు. చదువు, విద్యను కమ్యూనికేట్ చేసే గురువు లేకపోతే సమాజం ఉండదని తాను విద్యార్థులకు యువ విద్యార్థులకు చెప్పానని ఆయన అన్నారు.