రవి మృతి కేసులో కొత్త ట్విస్ట్: డీవీఆర్లో దృశ్యాలు మిస్?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తులో పోలీసు అధికారులు చేతివాటం చూపించారని, సాక్షాలు తారుమారు చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీనాయకుడు, రవి మామ హనుమంతరాయప్ప స్వయంగా ఈ విషయంపై బాంబు పేల్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించామని చెప్పిన తరువాత రవి మామ హనుమంతరాయప్ప చేసిన ఈ ఆరోపణలకు సీఐడి అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. హనుమంతరాయప్ప ఇంటి దగ్గర సీసీకెమెరాలు ఉన్నాయి.
సీసీటీవీ కెమెరాలకు ఎర్పాటు చేసిన డిజిటల్ వీడియో రికార్డర్స్ (డీవీఆర్)ను సీఐడీ పోలీసు అధికారులు తీసుకు వెళ్లారని, అందులోని అనేక దృశ్యాలు డిలిట్ అయ్యాయని రవి మామ హనుమంతరాయప్ప ఒక టివీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆందోళన వ్యక్తం చేశారు.
సీఐడి అధికారులు నాగరబావిలోని తన ఇంటి దగ్గరకు వచ్చారని హనుమంతరాయప్ప అన్నారు. ఆ సమయంలో తాను అక్కడ లేనని, డీవీఆర్లోని దృశ్యాలు రికార్డు చేసుకుని మళ్లీ తీసుకువచ్చి ఇస్తామని తమ కుటుంబ సభ్యులకు చెప్పి తీసుకు వెళ్లారని అన్నారు.
ఈ నెల 24వ తేదీ సోమవారం తనకు ఫోన్ చేసిన సీఐడి అధికారులు మంగళవారం డీవీఆర్ తెచ్చిస్తామని చెప్పారని అన్నారు. నేను మంగళవారం డీవీఆర్ పరిశీలించగా అందులో మే 16వ తేదీ ఉదయం 9.30 గంటల తరువాత రికార్డు అయిన దృశ్యాలు మాత్రం ఉన్నాయని, అంతకు ముందు రోజు దృశ్యాలు డిలిట్ అయ్యాయని రవి మామ హనుమంతరాయప్ప ఆరోపించారు.
ఈ విషయంపై తాను సీఐడి అధికారి కుమారస్వామికి ఫోన్ చేసి ఎందుకు డీవీఆర్ లోని దృశ్యాలు డిలిట్ అయ్యాయని అడిగితే అసలు డీవీఆర్ ఓపెన్ కాలేదని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె కుసుమా, అల్లుడు రవి మధ్య సరైన సంబంధాలు లేవని మీడియాలో తప్పుడు సమాచారం వచ్చిందని హనుమంతరాయప్ప అన్నారు. వారిద్దరు అన్యోన్యంగా ఉన్నారని చెప్పడానికి ఆ దృశ్యాలు అవసరమని చెప్పారు.
రవి మరణించిన సోమవారం ముందు రెండు రోజులు ఆయన, తమ కుమార్తె కుసుమా తమ ఇంటిలోనే ఉన్నారని గుర్తు చేశారు. వారిద్దరు మా ఇంటిలో ఎలా ఉన్నారని ప్రపంచానికి తెలియాలంటే సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలు సాక్ష్యమని అన్నారు.
సీఐడి పోలీసు అధికారులు డీవీఆర్ తీసుకు వెళ్లే సమయంలో తమ ఇంటి దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా వారు ఉన్నారని, వారి కెమెరాలలో పోలీసులు డీవీఆర్ తీసుకు వెళుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. డీవీఆర్ లో 20 రోజుల దృశ్యాలు రికార్డు చెయ్యవచ్చని చెప్పారు. డిలిట్ అయిన దృశ్యాలు మళ్లి చూసే అవకాశం ఉందని తాను సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్నానని హనుమంతరాయప్ప వివరించారు.