చిక్కుల్లో సిద్ధు: మరో పోలీసాఫీసర్ ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలో మరో పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళూరు డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ ఎంకె గణపతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కమంగళూరు సబ్ డివిజన్ డిప్యూటీ పోసీసు సూపరింటిండెంట్ కల్లప్ప హందీబాగ్ (35) తన బెలగవి జిల్లా ముర్గోద్లోని తన మామ ఇంట్లో ఉరేసుకుని మరణించాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
గణపతి ఆత్మహత్య కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. సీనియర్లు వేధించడం వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారంనాడు చెప్పారు.
వారంలో ఇద్దరు పోలీసాఫీసర్ల ఆత్మహత్య చేసుకోవడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మాజీ హోం మంత్రి జార్జ్ కూడా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
సిఐడి నివేదిక ఇచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. గణపతి గురువారంనాడు మంగళూరు నుచి మెడికెరికి వెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు. తనను వేధిస్తున్నారంటూ ఓ స్థానిక టీవి చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణపతి చెప్పారు. మాజీ హోం మంత్రి జార్జ్ పేరును కూడా ఆయన చెప్పారు.
పోలీసు శాఖలో జరుగుతున్న బదిలీల పట్ల తనకు తీవ్ర నిరాశ కలిగిందని, కుల ప్రాతిపదికపై బదిలీలు జరుగుతున్నాయని, ఉన్నతాధికారులు అటువంటి పనులు చేయకూడదని, అది మంచిది కానది, అది తప్పు అని, అందుకే తాను మీడియాకు బహిరంగంగా ఆ విషయాలు చెబుతున్నానని ఆయన అన్నారు.
తనకు ఏమైనా జరిగితే వారే బాధ్యులని కూడా ఆయన చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు ఎఎం ప్రసాద్, ప్రణబ్ మొహంతి, మాజీ హోం మంత్రి జార్జ్ బాధ్యులని ఆయన చెప్పారు వారు ముఖ్యమంత్రికి, హోంమంత్రి అత్యంత సన్నిహితులని గణపతి చెప్పారు.
గణపతి ఆత్మహత్య నేపథ్యంలో బిజెపి సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. జార్జ్ రాజీనామాకు డిమాండ్ చేసింది. గణపతితో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని, వ్యక్తిగత సమస్యలు కూడా లేవని, ఆయనను తాను వేధించాననే మాట అబద్ధమని జార్జ్ అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి తన రాజీనామాకు బిజెపి డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.
తాను అధికారులను వేధించినట్లు సాక్ష్యాధారులు ఉంటే చూపించాలని ఆయన బిజెపికి సవాల్ విసిరారు. అందులో వాస్తవం ఉంటే తాను రాజీనామా చేస్తానని అన్నారు.
శాఖపరమైన ఒత్తిడిని గణపతి ఎదుర్కుంటున్నట్లు తమకు అర్థమైందని ఆయన భార్య పావన అన్నారు. ఆయన చెప్పే విషయాలు తమకు సరిగా అర్థమయ్యేవి కావని అన్నారు.