సెలవు గొడవ: తోటివారిపై జవాన్ కాల్పులు, ముగ్గురి మృతి
బీహార్లో ఓ సీఎస్ఎఫ్ఐ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాను సహచరుల పైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పాట్నా: బీహార్లో ఓ సీఎస్ఎఫ్ఐ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాను సహచరుల పైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ సంఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది.
సెక్యూరిటీ డ్యూటీ నిమిత్తం నబీ నగర్ పవర్ జెనరేషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీజీసీఎల్) యూనిట్ వద్ద సీఐఎస్ఎఫ్ జవాన్లను దించారు. ఈ సమయంలో సంఘటన జరిగింది.
కాల్పులకు పాల్పడిన సీఐఎస్ఎఫ్ జవానును బల్వీర్ సింగ్గా గుర్తించారు. అతను ఉత్తర ప్రదేశ్లోని అలీఘర్కు చెందిన వాడు.
ఈ కాల్పుల్లో మృతి చెందిన వారు హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని తెలుస్తోంది. మరో హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.
సెలవు విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్ జవాను తన సహనం కోల్పోయి తన వద్ద ఉన్న రైఫిల్తో కాల్చాడని చెబుతున్నారు. బల్వీర్ సింగ్ను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
అతను తన సర్వీస్ రైఫిల్తో సహచరుల పైన కాల్పులు జరిపినట్లుగా ప్రాథమికంగా తేలిందని చెప్పారు. ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, అతను ఆసుపత్రిలో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డాక్టర్ సత్యప్రకాశ్ చెప్పారు.