దొంగతో మహిళా ఎస్సై పోరు, రైల్లో నుంచి కిందపడింది
భోపాల్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఓ దొంగతో పర్సు కోసం పోరాడే క్రమంలో రైలు కింద పడిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన గుణ జిల్లాలోని రైల్వే స్టేషన్లో జరిగిందని సోమవారం నాడు పోలీసులు తెలిపారు.
సుమన్ దాగర్ అనే మహిళ ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఆమె అజ్మీర్ నుంచి జబల్పూర్కు రైల్లో బయలుదేరారు. రుతియాల్ జంక్షన్ వద్ద దాగర్ తన బ్యాగ్, ఇతర వస్తువులను తీసుకుని రైలు దిగేందుకు తలుపు వద్దకు చేరుకున్నారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమె పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మహిళా ఎస్సై అతడి నుంచి దానిని తిరిగి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప పెనుగులాట జరిగింది. ఆమె ఒక్కసారిగా రైలు నుంచి కిందపడ్డారు.
ఇదే అదునుగా భావించిన దొంగ పర్సుతో పరారయ్యాడు. రైలు నుంచి కిందపడిన సుమన్ దాగర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. పర్సులో రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, విలువైన పత్రాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.