కౌంట్ డౌన్..అయోధ్యపై తీర్పు: సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్: అతి చేస్తే బేడీలే..!
లక్నో: దశాబ్దాల నుంచీ న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తోన్న చారిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించబోతోంది. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో.. ఈ లోగా రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. 17వ తేదీలోగా సుప్రీంకోర్టు పని దినాలు కూడా ఎక్కువగా లేవు. ఈ క్రమంలో- ఏ రోజైనా సరే సుప్రీంకోర్టు.. అయోధ్య భూ వివాదంపై తీర్పును వెలువరించడానికి అవకాశం ఉంది.
అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్
ఈ వారమే అవకాశం ఉందా?
ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముంగిట మూడు అత్యంత కీలకమైన కేసులు ఉన్నాయి. అయోధ్య భూవివాదంతో పాటు వేల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన మూడు కేసులపై రంజన్ గొగొయ్ తీర్పును వెలువడించాల్సి ఉంది. పని దినాలు ఎనిమిది రోజులే కావడంతో ఈ వారాంతం నుంచి ఒక్కో కేసు తీర్పును వెలవరిస్తూ వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
సోషల్ మీడియాపై నిఘా..
అత్యంత సున్నితం, సమస్యాత్మమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉంటోొంది. ప్రత్యేెకించి- సోషల్ మీడియాపై నిఘా వేసింది. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అనుకూల, వ్యతిరేక రాతలపై కొరడా
అయోధ్య భూ వివాదం కేసు తీర్పుపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని, అవసరమైతే రివ్యూ పిటీషన్లను దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రజలు తమ పరిధిని దాటి ప్రవర్తించకూడదని అయోధ్య జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్ ఝా స్పష్టం చేశారు. అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి పోస్టులు చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని సూచించారు.