పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎం
గౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాంలో ఆందోళనకారులు విధ్వంసానికి తెగబడుతున్నారు. ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి.
అసలైన భారతీయ పౌరులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అస్సాం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ఓ వీడియో ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. అస్సాం ప్రజల హక్కులను కాపాడుతామని తెలిపారు. ఆందోళనకారులు విధ్వంసం, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
We are committed to protect all genuine Indian citizens and the rights of the people of Assam.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) December 15, 2019
I call upon all sections of the society to thwart the elements who are misleading the people on #CAA & indulging in violence and together continue the growth journey of Assam. pic.twitter.com/RTGeWO2QCI
రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సీఎం సోనోవాల్ ప్రయత్నిస్తున్నారు. తర్వలోనే వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై వివరించనున్నట్లు తెలుస్తోంది. అస్సాం పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్టర్ చంద్రమోహన్ పతోవరి శనివారం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రంలో పరిస్థితిపై తెలుసుకున్నారని చెప్పారు. త్వరలోనే తాము మళ్లీ వారిని కలుస్తామని చెప్పారు.
బుధవారం రాజ్యసభ కూడా పౌరసత్వ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. అస్సాంలో ఆందోళనల కారణంగా ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు.
అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా మాట్లాడుతూ.. ఇప్పటికే 85 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పు పెట్టి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తుండటంతో ఈ అరెస్టులు చేశామని తెలిపారు. ఆందోళనకారులు చేస్తున్న విధ్వంసకాండను వీడియో కూడా తీశామని చెప్పారు.