మమతా బెనర్జీ బృందాన్ని లక్నో ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు
లక్నో: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనల్లో గాయపడిన, పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమ పార్టీ నుంచి నలుగురు ప్రతినిధులను ఆ రాష్ట్రానికి పంపింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు వెళ్లిన టీఎంసీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. లక్నో విమానాశ్రయంలో దిగిన వెంటనే టీఎంసీకి చెందిన నలుగురు ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాము విమానం దిగిన వెంటనే చాలా మంది పోలీసులు తమను చుట్టుముట్టారని, వెంటనే ఓ బస్సులో ఎక్కించారని టీఎంసీ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత రన్ వేపై ప్రాంతంలోకి తీసుకెళ్లారని, దీంతో తాము అక్కడే ధర్నాకు దిగామని చెప్పారు. కాగా, ఈ టీఎంసీ బృందంలో దినేష్ త్రివేది, మొహమ్మద్ నదిముల్ హక్, ప్రతిమ మండల్, అబీర్ బిస్వాస్ ఉన్నారు.
ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్సీనీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో తాను బతికుండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్సీని అమలు చేయబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నవారికి ఆమె పూర్తి మద్దతు తెలిపారు. అంతేగాక, స్వయంగా మమతా బెనర్జీని పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. పలు రైళ్తోపాటు ఐదారు రైల్వే స్టేషన్లకు కూడా నిప్పుపెట్టి తీవ్ర విధ్వంసం సృష్టించారు. పలు బస్సులు, ప్రైవేటు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. దీంతో మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు హింసాత్మక, విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ మమత సర్కారు చూస్తూ ఊరుకుందని బీజేపీ నేతలు మండిపడ్డారు.