Citizenship Act:యూపీలో ఉద్రిక్తత..మొబైల్, ఇంటర్నెట్ సేవలు 21వ తేదీ వరకు బంద్
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతతో దేశం అట్టుడుకుతోంది. సీఏఏ మంటలు చల్లారటం లేదు . దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో అట్టుడుకుతుంది . పలు రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లో నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది . పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా లక్నోలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీంతో అక్కడ మొబైల్ మరియు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. శతి భద్రతలను పరిరక్షించటానికి పోలీసులు కృషి చేస్తున్నారు.
లక్నోలో ఉద్రిక్తత .. పోలీసుల లాఠీ చార్జ్
యూపీలో పౌరసత్వ సవరణ చట్టం మంటలు చల్లారలేదు. లక్నోలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన నిరసనకారులు పోలీస్ పోస్ట్ ముందున్న వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. మదేగంజ్ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు డీజీపీ ఓ.పి.సింగ్ తెలిపారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పారు.
లక్నోలో డిసెంబర్ 21 మధ్యాహ్నం వరకు మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలు బంద్
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లక్నోలో డిసెంబర్ 21 మధ్యాహ్నం వరకు మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలు మరియు అన్ని మొబైల్ సర్వీసు ప్రొవైడర్ల ఎస్ఎంఎస్ లు నిలిపివేయబడ్డాయి.అదనపు చీఫ్ సెక్రటరీ అవనిష్ కుమార్ అవస్థీ గురువారం అర్థరాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 19 మధ్యాహ్నం 3 నుండి డిసెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిలిపివేత అమలులో ఉంటుంది" అని ఆయన ఉత్తర్వులో పేర్కొన్నారు.పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా హింసను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసులపై రాళ్ళు రువ్వటం , హింసాత్మక ఘటనల నేపధ్యంలో నిర్ణయం
రాష్ట్ర రాజధాని మరియు యూపీలోని మరికొన్ని ప్రాంతాల్లో నిరసనకారులతో హింస చెలరేగడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, వాహనాలను తగలబెట్టడంతో ఘర్షణలో 25 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.సంబల్, అలీగర్, ఘజియాబాద్ మరియు అజమ్గర్ జిల్లాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గుంపులుగా జనాలు సంచరించకుండా నిషేధించే సిఆర్పిసి సెక్షన్ 144 ఇప్పటికే మొత్తం రాష్ట్రంలో చాలా రోజులుగా అమలులో ఉంది.
ఆందోళనలు కంట్రోల్ చెయ్యలేకపోతున్న రాష్ట్రాలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన హింసను ఎదుర్కొన్న తరువాత 2015 కి ముందు భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలకు పౌరసత్వం కల్పించే సిఎఎ పై ఒక వర్గం ప్రజల నుండి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ జాబితా ముస్లింలను మినహాయించింది. ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అట్టుడుకుతూనే ఉన్నాయి.ప్రభుత్వాలకు ఈ ఆందోళనలను కంట్రోల్ చెయ్యటం కత్తిమీద సాములా మారింది.