Citizenship Act: ఈశాన్య రాష్ట్రాలలో కొనసాగుతున్న ఉద్రిక్తత..పశ్చిమబెంగాల్ లో ఇంటర్నెట్ సేవలు బంద్
పౌరసత్వ సవరణ చట్టంపై దేశం అట్టుడుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అసోం, వెస్ట్ బెంగాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని కేంద్రంగా కూడా ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రాలు .. సోషల్ మీడియాలో ట్రోల్స్
అసోం ,వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆందోళనకారులు పలు రైళ్లను, బస్సులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం పౌరసత్వ సవరణ చట్టం పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ట్రోల్ అవుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వెస్ట్ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టం పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి వెస్ట్ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. నార్త్ 24 పరగణా, సౌత్ 24 పరగణా , మాల్దా, ముర్షీదాబాద్, హౌవ్డా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే అసోంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
అయితే ఈ నిషేధం ఎప్పటి వరకు విధిస్తారు అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఇక అసోం లోనూ పది జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అసోంలో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. బుధవారం బంద్ చేపట్టిన నాటి నుండి నేటి వరకు పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. లక్షలాది మంది వారసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు.
అట్టుడుకుతున్న దేశం .. కత్తిమీద సాములా శాంతిభద్రతల పరిరక్షణ
ఇక పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో ఆందోళనకారులు ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టారు. బస్సులను దగ్ధం చేశారు . అంతేకాదు అసోంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అట్టుడుకుతూనే ఉన్నాయి.ప్రభుత్వాలకు ఈ ఆందోళనలను కంట్రోల్ చెయ్యటం కత్తిమీద సాములా మారింది.