Citizenship Amendment Act:అస్సాంలో శాంతియుత వాతావరణం..గౌహతిలో కర్ఫ్యూ ఎత్తివేత
పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ ఆందోళనలతో అట్టుడికిన అస్సాం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా అస్సాంలో ఆందోళనలు మిన్నంటాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువును సైతం ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు.
లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇక దిబ్రుగర్లో విధించిన కర్ఫ్యూను ఎత్తివేశారు. కానీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను మాత్రం పునరుద్ధరించలేదు. వాటిని ఇంకా సస్పెన్షన్ మోడ్లోనే ఉంచారు. డిసెంబర్ 11న అస్సాం రాజధాని గౌహతిలో కర్ఫ్యూ విధించడం జరిగింది. అయితే అక్కడ క్రమంగా వాతావరణం శాంతియుతంగా మారడంతో కర్ఫ్యూను ఎత్తివేశారు.
బ్యాంకులు, వ్యాపార సంస్థలు గౌహతిలో తిరిగి తెరుచుకోగా స్కూళ్లు, కాలేజీలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఇక గౌహతి నుంచి విమాన సర్వీసులు, రైలు సర్వీసులను పునరుద్ధరించారు. షెడ్యూల్ ప్రకారమే ఇవి నడుస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ డిసెంబర్ 21, డిసెంబర్ 23, 24, 26, 28 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలపాలని కోరింది.
ఇదిలా ఉంటే బుధవారం రోజున ఇస్లాం సంస్థ చీఫ్ అమీనుల్ హక్ను పోలీసులు అరెస్టు చేశారు. జరిగిన హింసలో అతని పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. మరోవైపు నిరసనల్లో భాగంగా చెలరేగిన హింసలో ఐదుగురు మృతి చెందడంపై సీరియస్ అయిన అస్సాం రాష్ట్ర మానవహక్కుల సంఘం ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక అందిచాలని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కోరింది.
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కింద నడిచే అస్సాం పబ్లికేషన్ బోర్డు 12 రోజుల పాటు గౌహతి బుక్ ఫెయిర్ను నిర్వహించాలని భావించి ప్రస్తుత పరిణామాలతో వాయిదా వేసింది. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇందులో భాగంగా ఆందోళనకారులు మూడు రైల్వే స్టేషన్లపై దాడి చేశారు. పోస్టాఫీసు, బ్యాంకులు, బస్ స్టేషన్లు, దుకాణాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్నిటికి నిప్పు పెట్టారు.